ప్రభు దయాల్ సేవలు భేష్ : కలెక్టర్ జితేష్ పాటిల్
కాకతీయ, కొత్తగూడెం : డాక్టర్ ప్రభు దయాల్ గత ఆగస్టు వరకు కొత్తగూడెం మండల విద్యాశాఖ అధికారిగా నోడల్ అధికారిగా సమర్థవంతంగా అత్యంత నిజాయితీగా విధులను నిర్వర్తించి రాష్ట్రస్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిన క్రమంలో ఆయన సేవలను రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగిత రాణా ప్రత్యేక లేఖ ద్వారా ప్రశంసించారు. అట్టి లేఖ ప్రతిని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో
శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ చేతుల మీదుగా డాక్టర్ ప్రభు దయాల్ అందుకున్నారు. దయల్ ప్రాథమిక విద్య పటిష్టతకై దయాల్ చేసిన అనేక సూచనలను ప్రభుత్వం గమనించడం గొప్ప విషయమని కలెక్టర్ పేర్కొన్నారు. అందరూ దయాల్ అంకిత భావాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యా శాఖకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. దయాల్ నిస్వార్ధ అంకితభావ సేవలను అందరూ స్ఫూర్తిగా తీసుకుంటూ విద్యారంగాభివృద్ధికై ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలంటూ కలెక్టర్ పిలుపునిచ్చారు.


