కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి..!
సంక్రాంతి వేళ రైతులకు నిరాశే మిగిలింది
బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కట్ చేస్తారా?
జర్నలిస్టుల అరెస్టులు కాంగ్రెస్ నిరంకుశత్వానికి నిదర్శనం
రైతుబంధు–రుణమాఫీపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం
కాకతీయ, జహీరాబాద్ : సంక్రాంతి పేరులోనే క్రాంతి ఉందని, తెలంగాణ ప్రజలకు విప్లవాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు ముందు ఉద్యమ క్రాంతి, టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి క్రాంతి జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.
సంక్రాంతి లాంటి ఆనందపు పండుగ వేళ అన్నదాతలను ఆందోళనలోకి నెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్శించారు. రైతు రుణమాఫీ నుంచి యూరియా దాకా రైతులను ఇబ్బందుల పాలుచేస్తోందని ఆరోపించారు. సగానికి సగం మందికి కూడా రుణమాఫీ జరగలేదని, ఎండకు, చలికి లైన్లలో నిలబడి యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. యాప్లు, మ్యాప్లు, కార్డుల పేరుతో రైతుల ఉసురు తీసుకుంటున్నారని మండిపడ్డారు.
రైతు బాంధవుడు కేసీఆర్
కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు వేసి రైతు బాంధవుడిగా నిలిచిన నాయకుడు కేసీఆర్ అని హరీష్ రావు గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి 73 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. 24 గంటల ఉచిత కరెంట్, రైతు బీమా, చెరువులు–ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించినది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ అంటూనే 12 గంటలే ఇస్తోందని, రెండు పంటలకు రైతుబంధు, ఒక పంటకు బోనస్ ఇచ్చి మరోదానికి ఎగ్గొట్టిందని విమర్శించారు.
రేవంత్ రెడ్డి బండ్లపై చలాన్లు పడితే బ్యాంక్ ఖాతాల నుంచి నేరుగా డబ్బులు కట్ చేయాలని చెప్పడం ప్రమాదకరమని అన్నారు. ప్రజలకు తెలియకుండా ఖాతాల నుంచి డబ్బులు తీసుకునేవాళ్లను సైబర్ నేరగాళ్లు అంటారని, ఇప్పుడు రేవంత్ రెడ్డికి వారికి పెద్ద తేడా లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
మున్సిపల్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల వేళ ఓట్ల కోసం చీరలు, రైతుబంధు పంచుతారని విమర్శిస్తూ.. కేసీఆర్ నాట్లకు నాట్లకు రైతుబంధు, బతుకమ్మకు చీరలు ఇచ్చారని తేడాను స్పష్టం చేశారు.
జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. మీడియాను బ్లాక్మెయిల్ చేయడం, ప్రశ్నించే గొంతులను అణిచివేయడం కాంగ్రెస్ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు, ఎస్సీ–ఎస్టీ కేసులు బనాయిస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.


