రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం
* మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్
* “టికెట్ ఇస్తే గెలిచి వస్తాం” అంటూ నేతల వద్ద వేడుకోలు
* డివిజన్లలో తిరుగుతూ మద్దతు కోరుతున్న ఆశావహులు
* అధికార పార్టీలో టికెట్ కోసం గట్టి పోటీ
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడకముందే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రిజర్వేషన్లు ఖరారు కాలేదు.. ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించలేదు. అయినప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీల్లో టికెట్ల కోసం పోటాపోటీ మొదలైంది. ఖమ్మం కార్పొరేషన్ పై పట్టు సాధించాలనే లక్ష్యంతో అన్ని పార్టీలు ముందస్తు వ్యూహాలతో కదులుతుండగా, అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాల్లోనూ ఆశావహుల హడావుడి స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీల నివాసాలు రాజకీయ సందడితో కిటకిటలాడుతున్నాయి. టికెట్ ఆశిస్తున్న నేతలు, వారి అనుచరులు, కుల సంఘాల ప్రతినిధులు, కాలనీ పెద్దలు వరుసగా నాయకులను కలుస్తూ తమ అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతున్నారు. “టికెట్ ఇస్తే తప్పకుండా గెలిపిస్తాం” అన్న హామీ నేతల చెవుల్లో మార్మోగుతోంది. వ్యక్తిగత ప్రతిభ, ప్రజాసేవ అనుభవంతో పాటు సామాజిక సమీకరణలు, కుల బలం, స్థానిక లెక్కలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
రిజర్వేషన్లు ఖరారు కాకముందే వ్యూహాలు
పురపాలక ఎన్నికల్లో కీలకమైన అంశమైన వార్డు రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ రిజర్వేషన్ల ఖరారు పెండింగ్లో ఉంది. అయినప్పటికీ “మనకు అనుకూలమైన రిజర్వేషన్ వచ్చే అవకాశాలే ఎక్కువ” అన్న అంచనాతో అభ్యర్థులు ముందుగానే రంగంలోకి దిగారు. కొందరు ఏ రిజర్వేషన్ వచ్చినా సరే తమకు కాకపోతే భార్యకు లేదా కుటుంబ సభ్యులకు టికెట్ దక్కేలా ముందస్తు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ధోరణి పార్టీల్లో అంతర్గత చర్చలకు, అసంతృప్తులకు దారితీస్తోంది.
మున్సిపల్ చైర్మన్ పదవుల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో అమలైన రిజర్వేషన్లే కొనసాగుతాయన్న అంచనాతో చైర్మన్ పదవి ఆశావహులు ఇప్పటి నుంచే రాజకీయ కసరత్తును వేగవంతం చేశారు. వార్డు స్థాయి నుంచి చైర్మన్ స్థాయి వరకు ఒకేసారి పోటీ తీవ్రంగా ఉండటంతో పార్టీలకు అభ్యర్థుల ఎంపిక సవాల్గా మారే అవకాశం కనిపిస్తోంది.
అధికార పార్టీపైనే ఎక్కువ ఆశలు
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని స్థానిక సంస్థల స్థాయిలోనూ పునరావృతం చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో అధికార పార్టీ టికెట్ దక్కితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న భావన ఆశావహుల్లో బలంగా ఉండటంతో కాంగ్రెస్లో పోటీ మరింత తీవ్రంగా మారింది.
మున్సిపల్ ఎన్నికలు అంటే స్థానిక సమస్యల పరిష్కారం, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలు ముందుండాల్సి ఉండగా, ప్రస్తుతం టికెట్ల రాజకీయాలు ఈ అంశాలను వెనక్కి నెట్టుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరు ఎంతకాలంగా పార్టీలో ఉన్నారు? ఎవరి వెనుక ఎంత బలం ఉంది? ఎవరి కుల సమీకరణలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయి? అన్నవే ప్రధాన ప్రమాణాలుగా మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది పార్టీలకే కాక ప్రజాస్వామ్యానికీ ప్రమాదకర సంకేతమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు


