గ్రామాల్లో సుపరిపాలనే లక్ష్యం
సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరాలి
సీతారామ ప్రాజెక్టుతో ఐదు మండలాలకు సాగునీరు
రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సర్పంచులకు పిలుపు
ఇల్లెందులో నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు సన్మానం
కాకతీయ, ఇల్లెందు : అభివృద్ధే లక్ష్యంగా గ్రామాల్లో సుపరిపాలన అందిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఇల్లెందు పట్టణంలోని సింగరేణి పాఠశాల క్రీడా ప్రాంగణంలో నియోజకవర్గ పరిధిలో నూతనంగా గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహించిన ఘన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో అందించిన సుపరిపాలన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసే ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో 69 శాతం విజయాన్ని అందించారని తెలిపారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతులకు పెట్టుబడి సాయం వంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాల్సిన బాధ్యత సర్పంచులదేనని స్పష్టం చేశారు.
త్వరలో మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, మరో మూడు విడతల్లో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, డ్వాక్రా రుణాల మాఫీతో పాటు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు గుర్తుచేశారు. ఇల్లెందు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సాగు, తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పొంగులేటి తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని, వచ్చే బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.
రాబోయే ఎన్నికల్లోనూ అదే ఉత్సాహం
రాబోయే మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహంతో కార్యకర్తలు పనిచేసి పార్టీ సత్తా చాటాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


