రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి
వచ్చే ఎన్నికల్లో పోటీ
త్వరలోనే విధి విధానాలు..
లెఫ్ట్ పార్టీలు, మావోయిస్టు సానుభూతిపరులతో జట్టు !
తనది ఆస్తుల పంచాయతీ కాదు.. ఆత్మగౌరవ పంచాయతీ..
కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన
మండలిలో ఎమ్మెల్సీగా చివరి ప్రసంగం
బీఆర్ఎస్ ఘోరంగా అవమానించిందంటూ సభలో కంటతడి
గన్పార్ట్ వద్ద అమరవీరులకు ఘన నివాళి
భవిష్యత్ కార్యాచరణపై కీలక వ్యాఖ్యలు
స్వాగతించిన ఆయా పార్టీల నేతలు
కవిత పార్టీతో ఒరిగేదేంలేదన్న బీజేపీ
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్పై తిరుగు బావుటా ఎగురవేసిన కల్వకుంట్ల కవిత.. శాసనమండలి వేదికగా తన తదుపరి కార్యాచరణ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన సంస్థ తెలంగాణ జాగృతిని ఓ రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు ఆమె సంచలన ప్రకటన చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఓ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో మరింత హీట్ పెంచేశాయి. “వ్యక్తిగా వెళ్తున్నా.. రాజకీయ శక్తిగా తిరిగి వస్తా” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. లెఫ్ట్ పార్టీలు, మావోయిస్టు సానుభూతిపరులతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని గన్పార్క్ వేదికగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. అయితే.. కవిత కొత్త పార్టీ ప్రకటనను ఆయా పార్టీల నేతలు స్వాగతించగా.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇనాళ్లూ అవినీతిలో అంటకాగి కుటుంబ పంచాయితీతో పార్టీ పెడుతున్నారని బీజేపీ మండిపడింది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త రాజకీయపార్టీకి చోటు ఉందా..? ప్రజలు కవిత పార్టీని ఆదరిస్తారా ? అనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో పోటీ..
రాజకీయ పార్టీగా ‘తెలంగాణ జాగృతి’ తెలంగాణ ఉద్యమ సమయంలో సాంస్కృతిక చైతన్యం కోసం పనిచేసిన ‘తెలంగాణ జాగృతి’ ఇకపై రాజకీయ క్షేత్రంలో పోరాడనుందని కవిత స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, త్వరలోనే పార్టీ విధివిధానాలను వెల్లడిస్తామని ఆమె పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన వైఫల్యాలను కవిత ఏకరువు పెట్టారు. రూ.14 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా, పేదలకు ఇళ్లు ఎందుకు కట్టించి ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ సాధించిన ఉద్యమకారులకు పార్టీలో గుర్తింపు లేదని, నిరుద్యోగులను కేవలం మభ్యపెట్టారని మండిపడ్డారు. భూ కబ్జాలు, కలెక్టరేట్ల నిర్మాణం కోసం అసైన్డ్ భూముల బదిలీ వంటి అంశాలను తాను ఎప్పటికప్పుడు అప్పటి నాయకత్వం(కేసీఆర్) దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్పై కోపంతో తాను జైలుకు..
శాసనమండలి వేదికగా ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. గత ఎనిమిదేళ్లుగా తాను ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజల గొంతుకగా చేస్తున్న ప్రయత్నాలను అడుగడుగునా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. నిజాయితీగా పని చేస్తున్న తనను ప్రోత్సహించాల్సింది పోయి, గొంతు నొక్కే ప్రయత్నం చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో తనపై జరిగిన వివక్షను తలచుకుని ఆమె కంటతడి పెట్టుకున్నారు. కేసీఆర్ పై కోపంతోనే తనను బీజేపీ జైలుకుపంపిందన్నారు. అయినా తన స్వంత పార్టీకి చెందిన మీడియా సంస్థల నుంచి తనకు కనీస మద్దతు లభించలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాల కోసం పని చేసే పత్రికలు, ఛానెళ్లు తన పోరాటాన్ని ఎప్పుడూ గుర్తించలేదని, పైగా తనపై దుష్ప్రచారం చేశాయని మండిపడ్డారు. లోపాలను ఎత్తిచూపినందుకు, పార్టీలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించినందుకే తనపై కక్షగట్టారని, ఆ కక్షతోనే చివరకు తనను పార్టీ నుంచి బహిష్కరించారని ఆమె ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చేందుకు కూడా తాను అంగీకరించలేదన్నారు. నైతికత లేని బీఆర్ఎస్కు దూరమైనందుకు తాను సంతోషిస్తున్నానని కవిత స్పష్టం చేశారు.
అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి
రాష్ట్రంలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి చోటుచేసుకుందని కవిత ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం నిర్మాణం నుంచి మొదలుపెడితే, అమరజ్యోతి వరకు ప్రతి పనిలోనూ అవినీతి అక్రమాలు జరిగాయి అని ఆమె ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఉద్యమకారులను, ప్రభుత్వ వైఫల్యాలను సూటిగా ప్రశ్నించే వారిని ప్రస్తుత పాలకులు వివక్షకు గురిచేస్తున్నారని, వారికి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్నారు. తన ఇద్దరు కొడుకుల మీద ప్రమాణం చేసి చేసి చెబుతున్నా.. తనది ఆస్తుల పంచాయతీ కాదని.. ఆత్మగౌరవ పంచాయతీనేనన్నారు.
ప్రజల పక్షాన నిలబడతా..
తనను పార్టీ నుంచి పంపించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతానని కవిత స్పష్టం చేశారు. కేవలం ప్రశ్నించినందుకే ఒక ప్రజాప్రతినిధిని వేధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, అధికారం చేతిలో ఉందని అణచివేతకు పాల్పడటం సరికాదన్నారు. నైతికత లేని పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఉండదల్చుకోలేదని అందుకే తన రాజీనామా ఆమోదించాలని చైర్మన్ను కోరారు. భావోద్వేగంతో సాగిన ఆమె ప్రసంగం మండలిలో ఉన్న సభ్యులందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. తన ప్రసంగం మొత్తం దాదాపుగా ఆమె కన్నీరు తుడుచుకుంటూనే ప్రసంగించారు. కవిత ప్రసంగం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూనే సాగింది. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా ఎవరూ ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
బంధాలు.. బంధనాలు తెంచుకొని..
అన్ని బంధాలు, బంధానాలు తెంచుకొని అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి బయటకు వచ్చా. జనం బాట మొదటి రోజే ఉద్యమకారులు, అమర వీరుల కుటుంబాలు తనను క్షమించాలని రిక్వెస్ట్ చేశా. వాళ్ల కోసం చేయాల్సినంతగా బీఆర్ఎస్ లో ఉండి చేయలేకపోయా. ఉద్యమకారులు, అమర వీరుల కుటుంబాలను కూడా జాగృతిలో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నా. దేవుడి దయతో గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతామని నమ్మకం ఉంది. నా పోరాటం ఆత్మగౌరవ పోరాటమే. తెలంగాణ ఆడబిడ్డలకు పౌరుషం ఎక్కువ. మనం ఏదీ కావాలని అడగం. కానీ మనల్ని అవమానిస్తే మాత్రం అస్సలే ఊరుకోం. నైతికంగా ఉండాలన్న ఉద్దేశంతోనే నా రాజీనామాను ఆమోదించాలని కౌన్సిల్ లో మరోసారి కోరా. ఒక గుంపుగా, ఒక సోసైటీగా, ఒక పార్టీగా మనం ఆర్గనైజ్ అయ్యేదే మంచి చేయటానికి. తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ లో మనందరం కూడా కట్టడితో పనిచేశాం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఉద్యమ ద్రోహులు ఆ పార్టీలో చేరారు… అని కవిత అన్నారు.
మాటిస్తున్నా నమ్మండి
ఇక కాంగ్రెస్ పార్టీ రెండేళ్లుగా మహిళలను, నిరుద్యోగులను, ఉద్యమకారులను మోసం చేస్తోంది. పన్నెండేళ్లుగా బీఆర్ఎస్, హస్తం పార్టీలు ప్రజలను మభ్య పెట్టి విపరీతంగా మోసం చేశాయి. రాష్ట్రంలో తెలంగాణ పేరును తనలో నింపుకొని మన అస్తిత్వం కోసం పోరాడే పార్టీ రావాల్సి ఉంది. ఫీజు రీయింబర్స్ మెంట్ రాని విద్యార్థులు పిడికిలెత్తి పోరాటం చేసేందుకు జాగృతిలో చేరండి. నిరుద్యోగులకు కొత్త ఉపాధి అవకాశాలు కావాలంటే నాతో పాటు పోరాడండి. అదివాసీ, గిరిజన, దళిత, మైనార్టీ బిడ్డల కోసం పోరాటం చేసే పార్టీ కావాలి. అందరి కన్నా ఆడబిడ్డల హక్కులు, అస్తిత్వం కోసం పోరాటం చేసే నన్ను దీవించండి. ఒక ఆడబిడ్డగా ముందడుగు వేస్తున్నా. నన్ను దీవించి ఆశీర్వదించండి. ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని యువత, మహిళలు కూడా రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తామని భావించాలి. అలాంటి వారి కోసం ఒక రాజకీయ వేదిక ఇస్తానని నేను మాటిస్తున్నా…. అని కవిత అన్నారు.


