గుట్టలుగా సిగరెట్ల స్టాక్!
ఖమ్మంలో టోకు వ్యాపారుల ముందస్తు దిగుమతులు
జీఎస్టీ పెంపుతో ముందే జాగ్రత్త పడిన వ్యాపారులు
ఫిబ్రవరి 1 నుంచి ధరలు పెరుగుతుండటంతో కోట్ల ఆర్డర్లు
తక్కువ ధరలకే కొనుగోలు.. అధిక ధరలకు అమ్మే వ్యూహం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరంలో సిగరెట్ల టోకు వ్యాపారులు ముందస్తు వ్యూహాలతో భారీ దందాకు తెరలేపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం కీలక పన్ను మార్పులు తీసుకురావడంతో, ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ముందుగానే భారీగా స్టాకులు సమీకరిస్తున్నారని సమాచారం. ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లపై 40 శాతం జీఎస్టీ అమల్లోకి రానుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న 28 శాతం జీఎస్టీతో పాటు కాంపెన్సేషన్ సెస్ విధానానికి ముగింపు పలికి, దాని స్థానంలో నేరుగా 40 శాతం జీఎస్టీని అమలు చేయనున్నారు. దీనితో పాటు సిగరెట్లపై ఇప్పటికే ఉన్న అదనపు ఎక్సైజ్ డ్యూటీలు కూడా కొనసాగనున్నాయి. పొగాకు వినియోగాన్ని తగ్గించడం, ఆరోగ్య సమస్యలతో పాటు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బీడీలపై మాత్రం 18 శాతం జీఎస్టీతో పాటు అదనపు సుంకాలు కొనసాగనున్నాయి. ఈ కొత్త పన్ను విధానం అమలుతో సిగరెట్ల ధరలు గణనీయంగా పెరిగే అవకాశముండటంతో, టోకు వ్యాపారులు ముందే ప్రస్తుత ధరలకే సిగరెట్లను కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారని చిన్న, సన్నకారు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. రాబోయే ధరల పెంపును ఆసరాగా చేసుకుని అధిక రేట్లకు విక్రయించడమే వారి వ్యూహమని చెబుతున్నారు. ఈ క్రమంలో కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు పెట్టి, గుట్టలుగా సిగరెట్ల స్టాకులు నిల్వ ఉంచినట్లు సమాచారం.
కోట్లలో లాభాలు గడించాలని..!
ఖమ్మం జిల్లా కేంద్రంగా ఈ వ్యాపారం సాగుతుండగా, ఇక్కడి నుంచే పరిసర మండలాలు, పట్టణాలకు సరఫరా జరుగుతోంది. ధరలు పెరిగేలోపే భారీగా స్టాకులు సమీకరించి కోట్ల లాభాలు గడించాలన్న ఆలోచనతో వ్యాపారులు ముందుకెళ్తున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ముందస్తు స్టాకింగ్ వల్ల రిటైల్ వ్యాపారులు కూడా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుండటంతో, చివరకు భారం నేరుగా వినియోగదారులపైనే పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ధరలు పెరుగుతాయని ఇప్పటికే కొందరు వ్యాపారులు ఎంఆర్పీకి మించి నాలుగు నుంచి ఐదు రూపాయలు అదనంగా వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఖమ్మం నుంచే జిల్లా వ్యాప్తంగా ఈ దందా సాగుతుండటం గమనార్హం.
కోట్లల్లో స్టాకులు.. గుట్టుచప్పుడు కాకుండా దందా
కొంతమంది పెద్ద వ్యాపారులు ఐటీసీ, మల్బార్ వంటి కంపెనీల అధికారిక డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను పక్కనబెట్టి, జీరో బిల్లులతో భారీగా సిగరెట్లు, కైని, గుట్కా, అంబర్ వంటి ఉత్పత్తులను కొనుగోలు చేసి కోట్ల రూపాయల విలువైన స్టాకులు నిల్వ ఉంచుకున్నారని చిన్న వ్యాపారులు ఆరోపిస్తున్నారు. గాంధీచౌక్ ప్రాంతంలో ఓ వ్యాపారి తన సోదరుడితో కలిసి రూ. మూడు నుంచి నాలుగు కోట్ల వరకు స్టాకులు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. ముందుగానే స్టాకులు నిల్వ పెట్టి, రిటైల్ వ్యాపారులకు అధిక ధరలకు సరఫరా చేయడం వల్ల వారు కూడా ప్రజలకు మరింత అధిక ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
చర్యలు తీసుకోకపోతే మళ్లీ సిండికేట్ల రాజ్యమే?
గతంలో గుట్కా, కైని ఉత్పత్తులపై నిషేధం విధించిన సమయంలో హోల్సేల్, రిటైల్ వ్యాపారులు సిండికేట్గా మారి కోర్టులను ఆశ్రయించి కేసులు గెలిచిన ఉదాహరణలు ఉన్నాయని వినియోగదారులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్పీకి మించి ధరలకు సిగరెట్లు విక్రయిస్తున్న వ్యాపారులను గుర్తించి, పోలీస్ శాఖతో పాటు సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ సిగరెట్ మాఫియాకు అడ్డుకట్ట పడదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


