పేదలకు వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయం
రెండేళ్లలో పెద్దతండాలో రూ.56కోట్లతో అభివృద్ధి
యుద్ధప్రాతిపదికన మున్నేరుపై రిటైనింగ్ వాల్
రెవెన్యూ, హౌజింగ్ శాఖల మంత్రి పొంగులేటి
ఏదులాపురంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన
సీసీ రోడ్లతో కాలనీలకు కొత్త రూపు
కాకతీయ, ఖమ్మం/ఏదులాపురం : పేదలకు మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన మంత్రి పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. టెంపుల్ సిటీలో రూ.33.90 లక్షలు, చిన్న తండాలో రూ.20.33 లక్షలు, సూర్యనగర్లో రూ.24.87 లక్షలు, నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీలో రూ.24.87 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… ఏదులాపురం పెద్దతండా గ్రామ పంచాయతీ పరిధిలో గత రెండేళ్లలో రూ.14 కోట్లతో పలు మౌళిక వసతుల పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను నిరంతరం అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పెద్దతండాలో నూతనంగా నివాసం ఉంటున్న ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాబోయే ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రారంభమవుతుందని, ప్రతి సంవత్సరం ఈ పథకం కొనసాగుతుందని మంత్రి ప్రకటించారు.
మున్నేరు రిటైనింగ్ వాల్ యుద్ధప్రాతిపదికన
నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీలో గత వరదల నేపథ్యంలో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించిందని, భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా రూ.580 కోట్లతో మున్నేరు నదికి రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టి రాబోయే వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం 10 రోజుల్లో కాలనీలో అవసరమైన మరమ్మతు పనులు చేపడతామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ… ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన సీసీ రోడ్ల పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఏదులాపురాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ సందర్భంగా గుర్రాలపాడు తండాలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు నునావత్ భారతి నిర్మించుకున్న ఇంటిని మంత్రి ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీ సునీల్ దత్, ఆర్&బీ ఈఈ యాకుబ్, ఇరిగేషన్ ఈఈ ఎం. వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాధ్ బాబు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


