విద్య, వైద్యంలో ప్రభుత్వం వైఫల్యం
హామీలను నిలబెట్టుకోని ప్రభుత్వం
తుంగతుర్తిలో ఎక్కడా చూసినా సమస్యలే
తుంగతుర్తిలో ‘జనం బాట’ లో కవిత విమర్శలు
రెండేళ్లుగా హాస్పిటల్ కడుతూనే ఉన్నారని ఎద్దేవా
హామీల అమలుకు పిడికిలెత్తాలంటూ పిలుపు
కాకతీయ, తుంగతుర్తి : విద్య, వైద్యం అందించడంలో రేవంత్ సర్కారు విఫలమవుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. సూర్యపేట జిల్లా తుంగతుర్తిలో శనివారం జరిగిన జనంబాట కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతన్కల్లో తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, సీనియర్ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా కవితకు ఘన స్వాగతం లభించింది. ‘జనం బాట’ కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తిలో పర్యటిస్తున్న కవిత ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగించారు.
హామీల అమలేది..?!
తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటిస్తే పాడుపడ్డ కాల్వలు, నిర్లక్ష్యానికి గురైన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని కవిత విమర్శించారు. 100 పడకల హాస్పిటల్, రుద్రమ చెరువు అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు నిలబెట్టుకోలేదని ఆరోపించారు. 2018 నుంచి తుంగతుర్తిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం సాగుతూనే ఉందని, గత ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత మళ్లీ శంకుస్థాపన చేయడం తప్ప పురోగతి లేదన్నారు. గత ప్రభుత్వంలో నాలుగేళ్లు, ప్రస్తుత ప్రభుత్వంలో రెండేళ్లుగా హాస్పిటల్ కడుతూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆసుపత్రికి మూడున్నర లక్షల మంది ప్రజలు వస్తున్నారని సిబ్బందే చెబుతున్నారని, సరైన వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నెలకు రెండు డెలివరీలు మాత్రమే జరుగుతున్న పరిస్థితి ఉందని, తప్పనిసరి పరిస్థితుల్లో పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకే వెళ్లాల్సి వస్తోందన్నారు.
హామీల అమలుకు పోరాటం
హాస్పిటల్ నిర్మాణం ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నిస్తే బిల్లులు రావట్లేదని కాంట్రాక్టర్ చెబుతున్నాడని, విద్య–వైద్యాలపై ఖర్చు చేయని ప్రభుత్వం మరెందుకు ఖర్చు చేస్తోందని నిలదీశారు. పెన్షన్లు పెంచుతామని, ఫ్రీ కరెంట్, ఫ్రీ గ్యాస్, రైతుబంధు పెంచుతామని కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదన్నారు. ప్రజలు గట్టిగా నిలదీయకపోవడమే ఇందుకు కారణమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఓట్లు లేవని, ఓట్లు అడగటానికి తాను రాలేదని స్పష్టం చేసిన కవిత… పదేళ్లు, పదిహేనేళ్లుగా పెండింగ్లో ఉన్న పనులు చేయించేందుకే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నామని తెలిపారు. ప్రజలను ఓట్లు వేసే మెషీన్లుగా చూసే సంస్కృతి పోవాలని, కొత్త రాజకీయ పంథా రావాలని ఆకాంక్షించారు.
సూర్యాపేట జిల్లా అంటేనే చైతన్యానికి ప్రతీక అని, మల్లు స్వరాజ్యం, బండి యాదగిరి, మారోజు వీరన్న వంటి మహనీయులను కన్న నేల ఇదని గుర్తుచేశారు. వారి స్ఫూర్తితో సమాజంలోని అట్టడుగు వర్గాలు, మహిళలు, యువత కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. ఆడబిడ్డల పట్ల తనకు ప్రత్యేక పక్షపాతం ఉందని, వారికి విద్య–వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉండాలని కోరుకుంటానన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన 250 గజాల భూమి, రూ.25 వేల పెన్షన్ అందే వరకు పోరాటం చేస్తామని, అవసరమైతే ప్రభుత్వ భూములపై పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నూతన్కల్ ప్రజలు చెప్పిన అన్ని సమస్యలపై తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని, ఎండను లెక్కచేయకుండా ఘన స్వాగతం పలికిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.


