నవ లిమిటెడ్ సామాజిక సేవలు అభినందనీయం
జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అండ్ జడ్పీ సీఈఓ బి. నాగాలక్ష్మి
ప్రభుత్వ పాఠశాలలకు బల్లల పంపిణీ
కాకతీయ, కొత్తగూడెం : నవ భారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ (నవ లిమిటెడ్) ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అండ్ జడ్పీ సీఈఓ బి. నాగాలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం పాల్వంచలో నవ లిమిటెడ్ సిఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సౌకర్యార్థం డెస్క్లు (బల్లలు) పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలకు నవ లిమిటెడ్ అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని ఆమె అన్నారు. పలు పాఠశాలలకు సైన్స్ ప్రయోగశాలలు, ప్రయోగ పరికరాలు అందించడం అభినందనీయమని, కంప్యూటర్ విద్య కోసం నైపుణ్యం గల ఉపాధ్యాయులను నియమించడం హర్షణీయమన్నారు. విద్యార్థులకు ఉచిత ట్యూషన్లు ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అలాగే 39 ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేని విద్యార్థులకు వాష్రూమ్స్, హ్యాండ్వాష్ సదుపాయాలు కల్పించడం గొప్ప కార్యమని అభినందించారు. అనంతరం నవ లిమిటెడ్ జనరల్ మేనేజర్ (సీఎస్ఆర్) ఎం.జి.ఎం. ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలకు సుమారు 4,500 బల్లలు అందించామని తెలిపారు. భవిష్యత్తులోనూ విద్యారంగానికి మరింత సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీరామ్మూర్తి, నవ భారత్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్.వి.కే. ప్రసాద్, నవ భారత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పి. జ్యోతి, రాజేశ్వరరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


