సాగునీటి విడుదలపై స్పష్టత ఇవ్వాలి
గణపురం ఆనకట్ట ఆధారంగా వేల ఎకరాల సాగు
ప్రభుత్వం ఏ విషయం చెప్పకుండా సాగదీత
సాధ్యం కాకుంటే క్రాప్ హాలిడే ప్రకటించి పరిహారం చెల్లించాలి
మెదక్ జిల్లా రైతాంగం యాసంగిపై అయోమయం
మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్
కాకతీయ, మెదక్ : సింగూరు ప్రాజెక్టు నుంచి గణపురం ఆనకట్టకు సాగునీరు విడుదల చేస్తారా లేదా అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు డిమాండ్ చేశారు. యాసంగి సాగు చేయాలా వద్దా అన్న తీవ్ర సందిగ్ధంలో మెదక్ జిల్లా రైతాంగం కొట్టుమిట్టాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గణపురం ఆనకట్టపై ఆధారపడి వేల ఎకరాల భూమి సాగవుతోందన్నారు. పాపన్నపేట, హవేలీఘన్పూర్, కొల్చారం, మెదక్ రూరల్ మండలాల్లోని వేలాది ఎకరాల వ్యవసాయం పూర్తిగా గణపురం ఆనకట్టపై ఆధారపడి ఉందన్నారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై స్పష్టత లేకపోవడం రైతుల్లో ఆందోళన పెంచుతోందన్నారు.
వేసవిలో చేయాల్సిన పనులు ఇప్పుడు ఎందుకు?
సింగూరు ప్రాజెక్టు మరమ్మతులు వేసవిలో చేయాల్సి ఉండగా, ఇప్పుడు చేపట్టడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ పంటను కాపాడుతూ మరమ్మతులు చేయవచ్చని, కానీ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నాట్ల సమయం దగ్గర పడుతున్నా అధికారులు స్పందించకపోవడంతో రైతులు గత్యంతరం లేక మళ్లీ బోర్లు వేస్తూ అప్పుల పాలవుతున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో బోరు బండి మాయమైతే, రేవంత్ రెడ్డి పాలనలో మళ్లీ పాత రోజులు వచ్చాయని ఎద్దేవా చేశారు.
నీటి విడుదల లేకపోతే క్రాప్ హాలిడే
సింగూరు నీటిపై మెదక్, నిజామాబాద్ రైతుల హక్కులను ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ చేశారు. తక్షణమే గణపురం ఆనకట్టకు నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరాకు తగిన నష్టపరిహారం చెల్లించాలని సూచించారు. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు పంటలకు నీళ్లు అందించి రైతులు హైదరాబాద్కు వలస వెళ్లకుండా చూసిన ఘనత ఉందన్నారు. అవసరమైతే కాళేశ్వరం నీళ్లను మళ్లించి కూడా పంటలను కాపాడినట్టు గుర్తు చేశారు.
రూ.1800 కోట్ల బోనస్ బకాయిలు
రుణమాఫీ, రైతుబంధు, బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. ఏడుపాయల సాక్షిగా రుణమాఫీ చేస్తానన్న సీఎం ఇప్పటివరకు కేవలం 40 శాతం మందికే పూర్తి చేశారని విమర్శించారు. గత యాసంగి, ఈ వానాకాలం కలిపి రైతులకు రావాల్సిన సుమారు రూ.1800 కోట్ల బోనస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి యాప్లు, మ్యాప్లు కాదని… నీళ్లు, కరెంటు, ఎరువులు కావాలని హరీష్ రావు స్పష్టం చేశారు. స్మార్ట్ఫోన్ లేని రైతులు, మహిళా రైతులు యాప్లు ఎలా వాడతారని ప్రశ్నించారు. ఇది రైతులను వేధించేందుకే చేస్తున్న నాటకమని ఆరోపించారు. కొత్త చట్టాల పేరుతో కౌలు రైతులు, యజమానుల మధ్య పంచాయతీలు పెడుతున్నారని ఆరోపించారు. యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, గతంలో మాదిరిగా ఫెర్టిలైజర్ షాపుల ద్వారా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే రుణమాఫీ పూర్తి చేయాలని, బోనస్ బకాయిలు చెల్లించాలని, రైతుబంధు విడుదల చేయాలని, గణపురం ఆనకట్ట నీటిపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


