అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
అభివృద్ధి పనుల భూ సేకరణ ప్రాధాన్యతగా పరిగణించాలి
మార్చి 2026 నాటికి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి
మున్నేరు రిటైనింగ్ వాల్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై మంత్రి తుమ్మల సమీక్ష
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : అభివృద్ధి పనులు నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సోమవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మున్నేరు నదిపై రిటైనింగ్ వాల్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, ఖమ్మం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులపై నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ మున్నేరు నదికి ఇరువైపులా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ప్రస్తుతం వర్కింగ్ సీజన్ నడుస్తుందని, పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్నేరు నదిపై రిటైనింగ్ వాల్ నిర్మాణానికి బైపాస్ రోడ్డు నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు మొదటి ప్రాధాన్యతగా, కేబుల్ బ్రిడ్జి నుంచి ప్రకాష్ నగర్ బ్రిడ్జి వరకు రెండవ ప్రాధాన్యతగా పెండింగ్ భూ సేకరణ త్వరగా క్లియర్ చేయాలని మంత్రి తెలిపారు. మున్నేరు నదికి ఇరు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు సమాంతరంగా జరగాలని అన్నారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నిమిత్తం భూముల బదలాయింపు కోసం అడ్వాన్స్ పోజిషన్ వెంటనే అందించాలని సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులను మంత్రి చరవాణిలో ఆదేశించారు.
మార్చిలోగా రిటైనింగ్ వాల్ పూర్తి చేయాలి
మార్చి 2026 నాటికి మున్నేరు నది రీటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని, ప్రతి నెల ఎంత మేరకు పనులు పూర్తవుతాయో నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసి సమర్పించాలని మంత్రి సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీలకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నూతన టెక్నాలజీతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరగాలని, హైదరాబాద్ దుర్గం చెరువు, కరీంనగర్ మానేరు నదిపై గతంలో కేబుల్ బ్రిడ్జిలు ఉన్నాయని, రాష్ట్రంలో 3వ కేబుల్ బ్రిడ్జి ఖమ్మం నగరంలో నిర్మాణం అవుతుందని, కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుగుణంగా అవసరమైన పవర్ లైన్స్, విద్యుత్ స్తంభాల తరలింపు పనులు 15 రోజులలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తాగునీటి పైప్ లైన్, పవర్ లైన్ తరలింపు పనులు సమాంతరంగా జరగాలని అన్నారు. కేబుల్ బ్రిడ్జిపై లైటింగ్ అద్భుతంగా ఉండేలా చూడాలని, రాష్ట్రంలో 3 కేబుల్ బ్రిడ్జిలలో మన కేబుల్ బ్రిడ్జి ఆకర్షణీయంగా ఉండేలా చూడాలని, దీనికి సంబంధించి అవసరమైన అదనపు నిధుల ప్రతిపాదనలు ఉంటే సమర్పించాలని మంత్రి తెలిపారు. ఖమ్మం నగరం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్.టి.పి. నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పనులు వెంటనే పూర్తి చేయాలని, క్షేత్ర స్థాయిలో ప్రజలను ఒప్పించి భూ సేకరణ పూర్తి చేసి సంబంధిత ఏజేన్సీలకు త్వరగా భూమి అప్పగించాలని అన్నారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఎస్ఇ రంజిత్, ఇరిగేషన్ ఎస్ఇ ఎం. వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఎస్ ఈ యాకోబు, విద్యుత్ ఎస్ఇ, తహసీల్దార్ లు రాంప్రసాద్, సైదులు, ఏజెన్సీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


