కేంద్ర మంత్రి గడ్కరీకి తుమ్మల లేఖ
ఖమ్మం–అశ్వారావుపేట రోడ్డును వన్ టైం ఇంప్రూవ్మెంట్ (రెన్యువల్) చేయండి
కొణిజర్ల, కల్లూరు, పెనుబల్లి, దమ్మపేట జంక్షన్లను ఆధునీకరించండి
4 లైన్ల రహదారి, డివైడర్, సెంట్రల్ లైటింగ్ మరియు డ్రైన్లు మెరుగుపరచాలి
రీజనల్ ఆఫీసర్ మోర్తా కృష్ణ ప్రసాద్ కు సైతం లేఖ రాసిన మంత్రి
సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి గడ్కరీ, రీజనల్ ఆఫీసర్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : కేంద్ర రహదారి రవాణా మరియు హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. అనంతరం కేంద్రమంత్రి తో ఫోన్లో మాట్లాడిన ఆయన ఖమ్మం–అశ్వారావుపేట జాతీయ రహదారిపై అత్యవసరంగా వన్ టైం ఇంప్రూవ్మెంట్ (రెన్యువల్) పనులు తక్షణమే చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇప్పటికే ఈ రహదారి నాలుగు లైన్లుగా విస్తరించేందుకు డిపిఆర్ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ పనులు ప్రారంభం కావాలంటే సంవత్సరం సమయం పడుతుందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రోడ్డు వర్షాల కారణంగా గుంతలు ఏర్పడి అధ్వానంగా ఉందని ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి లేఖలో ప్రస్తావించారు. అంతరాష్ట్ర ప్రాధాన్యం కలిగిన ఖమ్మం–అశ్వారావుపేట రహదారి జాతీయ రహదారి 365BBలో భాగమై, రాబోయే NH–365BG గ్రీన్ఫీల్డ్ హైవే మార్గంలోనూ ఉండటంతో ఈ మార్గానికి వ్యూహాత్మక ప్రాధాన్యం పెరిగిందని మంత్రి తుమ్మల చెప్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, వైజాగ్ పోర్టులకు వెళ్లే వాహనాలు మరియు హైదరాబాద్ నుంచి ఆంధ్రకు వెళ్లే వాహనాలు కూడా అధికంగా ఈ రహదారినే వినియోగిస్తున్నట్టు తెలిపారు. అయితే ప్రస్తుత రహదారి తీవ్రంగా దెబ్బతినడం, గుంతల వల్ల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోడ్డుకు పునరుద్ధరణ పనులు చేయడం అత్యవసరమని మంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితి అత్యవసర దశలో…
రహదారిని ఫోర్ లైన్ గా విస్తరించేందుకు డీపీఆర్ సిద్ధం చేసే పనులు ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా డీపీఆర్ సిద్ధం చేయడానికి మరింత సమయం పడుతుందని మంత్రి తుమ్మల లేఖలో స్పష్టం చేశారు. 4 లేన్ల రోడ్డు ప్రాజెక్టులు పూర్తికావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున, ప్రస్తుత NH–365BB పై వన్ టైం ఇంప్రూవ్మెంట్ చేపట్టడం తప్పనిసరి అని మంత్రి తుమ్మల లేఖలో స్పష్టం చేశారు. జగ్గయ్యపేట–కొత్తగూడెం వయా వైరా జాతీయ రహదారిని మంజూరు చేయాలని గడ్కరీ ని తుమ్మల కోరారు. జాతీయ రహదారి 65 మీద ఉన్న జగ్గయ్యపేట నుంచి జాతీయ రహదారి 30 మీద ఉన్న కొత్తగూడెం వరకు కొత్త జాతీయ రహదారి ఆమోదం లభిస్తే రెండు ప్రధాన జాతీయ రహదారులు అనుసంధానం కావడంతో పాటు తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. జగ్గయ్యపేట నుంచి బోనకల్, వైరా, తల్లాడ మీదుగా కొత్తగూడెం వరకు ఈ రహదారిని మంజూరు చేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఈ మార్గం రాష్ట్ర రహదారిగా ఉన్నదని, దీనిని జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేసినట్లయితే భద్రాచలం దర్శనార్థం వచ్చే భక్తులకు కూడా మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించవచ్చని మంత్రి తెలిపారు. అంతేకాకుండా, ఈ రహదారి అభివృద్ధి ద్వారా ప్రధాన పరిశ్రమల క్లస్టర్ల మధ్య కనెక్టివిటీ మెరుగుపడటంతో జగ్గయ్యపేట సిమెంట్ పరిశ్రమలు, అలాగే కొత్తగూడెం, పాల్వంచ, అశ్వపురం, మణుగూరు ప్రాంతాల్లోని పరిశ్రమలకు రవాణా సదుపాయాలు గణనీయంగా మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
జంక్షన్లు మున్సిపాలిటీ ల అభివృద్ధి
కొణిజర్ల ,కల్లూరు మున్సిపాలిటీ,పెనుబల్లి, దమ్మపేట (మందలపల్లి) జంక్షన్లలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున వాటిని ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని మంత్రి గడ్కరిని కోరారు. అలాగే ఈ ప్రాంతాల్లో కొత్తగా నాలుగు వరుసల రహదారి,సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి ఏర్పాట్లు అత్యవసరమని, కాబట్టి వీటిని వెంటనే మంజూరు చేయాలని మంత్రి తుమ్మల కోరారు. ఇదే అంశంపై మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవే ల రిజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్కూ వేరుగా లేఖ రాసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రమాదాల నియంత్రణ, రాకపోకల సౌలభ్యం, ఖమ్మం జిల్లాకు నిరంతర రహదారి అనుసంధానానికి ఈ పనులు అత్యంత కీలకమన్న మంత్రి తుమ్మల, అవసరమైన అనుమతులు, నిధులు వెంటనే మంజూరు చేసి తక్షణమే పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. దీనికి స్పందించిన కేంద్రమంత్రి తక్షణమే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


