కాకతీయ, తెలంగాణ బ్యూరో/పాల్వంచ : విద్యార్థుల విద్యా ప్రగతికి శారీరక, మానసిక ఆరోగ్యం కీలకమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. అంతర్జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా సోమవారం పాల్వంచ బొల్లారిగూడెం మైనారిటీ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుతో కలిసి ప్రారంభించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. నులిపురుగులు పిల్లలలో పోషకాహార లోపం, రక్తహీనత, ఆకలి తగ్గడం, అలసట, కడుపు నొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడం వంటి సమస్యలకు కారణమవుతాయని, ఇవి వారి శారీరక ఎదుగుదల, చదువులో ఏకాగ్రతపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. ఈ సమస్యను నివారించడానికి ఆల్బెండజోల్ మాత్రలు ప్రభావవంతమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1 నుండి 19 ఏళ్ల మధ్య వయస్సు గల 3,36,136 మంది పిల్లలు, యువతకు ఈ మాత్రలు అందించనున్నట్లు తెలిపారు. అన్ని పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, కళాశాలల్లో మాత్రలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. నులిపురుగుల నివారణ మాత్రల వలన ఎలాంటి దుష్ప్రభావాలు లేవని, తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు పెట్టుకోరాదని సూచించారు. మధ్యాహ్న భోజనం అనంతరం మాత్రలు ఇవ్వాలని, 1–2 ఏళ్ల పిల్లలకు సగం మాత్ర, 2–19 ఏళ్ల వారికి పూర్తి మాత్ర నమిలి మింగేలా చేయాలని సూచించారు. ఆగస్టు 18 వరకు జరిగే ఈ కార్యక్రమంలో 19 ఏళ్ల లోపు ప్రతి ఒక్కరికి మాత్రలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జయలక్ష్మి, సిపిఓ సంజీవరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బోధక సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.


