విద్య ద్వారా పేదరికం నుంచి శాశ్వతంగా విముక్తి…
జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ,స్వాతంత్రం వచ్చిన తరువాత మొట్ట మొదటి నెహ్రూ నాయకత్వంలోని క్యాబినెట్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, ఆయన పుట్టినరోజు సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. హిందీ, అరబిక్, బెంగాలీ, ఇంగ్లీష్ భాషలలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పండితుడని, 11 సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పని చేశారని, దేశంలోని అన్ని వర్గాల ప్రజలు చదువుకోవాలని ఆశయంతో కులమత బేధాలు లేకుండా పని చేశారని అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను గుర్తించిన ప్రభుత్వం 1992 లో భారతరత్న అవార్డు అందజేసి గౌరవించిందని కలెక్టర్ అన్నారు. పేదరికం విద్యతో మాత్రమే దూరమవుతుందని భావించి ప్రతి పేదవాడికి విద్య అందే దిశగా చర్యలు తీసుకున్నారని అన్నారు. వ్యక్తిగతంగా మతపరమైన సంప్రదాయాలు పాటిస్తూ మనమంతా భారతదేశంలో భాగమని తెలిపారని అన్నారు. మన రాష్ట్రంలో ప్రభుత్వం మైనారిటీ విద్యపై దృష్టి పెడుతూ గురుకులాలను ఏర్పాటు చేసిందని, ప్రత్యేకంగా మైనారిటీ బాలికల విద్య పై దృష్టి సారించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇక్కడ అన్ని కులాలు వర్గాల వారు కలిసి చదువుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డా. బి. కళావతి బాయి, జిల్లా మైనార్టీ శాఖ అధికారి ముజాహిద్, కలెక్టరేట్ ఏవో కె. శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


