సివిల్స్లో మెరిసిన యువత..!
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాల విడుదల
దేశవ్యాప్తంగా తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది ఎంపిక
మహిళల సత్తా.. రెండు వందల తొంభై తొమ్మిది మంది విజయం
తెలుగు రాష్ట్రాల నుంచి నలభైకి పైగా ర్యాంకులు
దేశంలో అత్యున్నత సర్వీసుల్లో చేరనున్న యువత
మెడికల్ విద్యార్థి అనూజ్ అగ్నిహోత్రికి తొలి ర్యాంకు
న్యూఢిల్లీ / కాకతీయ బ్యూరో : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షల తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఈసారి తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది అభ్యర్థులు తుది జాబితాలో స్థానం సంపాదించారు. మొత్తం వెయ్యి ఎనభై ఏడు ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా అందులో తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది మాత్రమే అర్హత సాధించారు. ఎంపికైన వారిలో ఆరు వందల యాభై తొమ్మిది మంది పురుషులు కాగా రెండు వందల తొంభై తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. జనరల్ కేటగిరీ నుంచి మూడు వందల పదిహేడు మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి నూట నాలుగు మంది, ఓబీసీ కేటగిరీ నుంచి మూడు వందల ఆరు మంది, ఎస్సీ కేటగిరీ నుంచి నూట యాభై ఎనిమిది మంది, ఎస్టీ కేటగిరీ నుంచి డెబ్బై మూడు మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ ఫలితాల్లో నలభై రెండు మంది దివ్యాంగులు కూడా విజయం సాధించడం విశేషం. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కాగా ప్రిలిమినరీ పరీక్షకు ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల తొంభై మూడు మంది హాజరయ్యారు. తరువాత నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు పద్నాలుగు వేల నూట అరవై ఒకరు అర్హత సాధించగా ఇంటర్వ్యూకు రెండు వేల ఏడువందల ముప్పై ఆరు మంది హాజరయ్యారు.

అనూజ్ అగ్నిహోత్రికి తొలి ర్యాంకు
ఈసారి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అనూజ్ అగ్నిహోత్రి దేశంలో తొలి ర్యాంకు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. జోధ్పూర్లోని ఎయిమ్స్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆయన మెడికల్ సైన్స్ను ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకుని ఈ విజయాన్ని సాధించారు. రెండో ర్యాంకును రాజేశ్వరి సువే సాధించారు. చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివిన ఆమె సోషియాలజీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. ఆకాంశ ధుల్ మూడో ర్యాంకు సాధించగా రాఘవ్ ఝునఝునవాలా నాలుగో ర్యాంకు, ఈషాన భట్నాగర్ ఐదో ర్యాంకు సాధించారు. జినియా అరోడా ఆరో ర్యాంకు, ఏ ఆర్ రజా మొహియిద్దీన్ ఏడో ర్యాంకు, పక్షల్ సెక్రటరీ ఎనిమిదో ర్యాంకు, అస్థా జైన్ తొమ్మిదో ర్యాంకు, ఉజ్వల్ ప్రియాంక్ పదో ర్యాంకు సాధించారు. ఈసారి తొలి ఇరవై ఐదు ర్యాంకుల్లో పదకొండు మంది మహిళలు, పద్నాలుగు మంది పురుషులు ఉండటం గమనార్హం. టాప్ ర్యాంకుల్లో నిలిచిన అభ్యర్థులు దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్ ఎల్ యూ, ఎయిమ్స్, డీటీయూ, అన్నా యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ వంటి సంస్థల్లో విద్యనభ్యసించిన వారు ఉన్నారు. వీరు ఇంజనీరింగ్, హ్యూమానిటీస్, సైన్స్, కామర్స్, లా, మెడికల్ సైన్స్, మాస్ మీడియా వంటి విభాగాల్లో చదివిన విద్యార్థులు కావడం విశేషం. మెయిన్స్ పరీక్షల్లో ఆంత్రోపాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, హిస్టరీ, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి వివిధ సబ్జెక్టులను ఆప్షనల్స్గా అభ్యర్థులు ఎంచుకున్నారు.

తెలుగు అభ్యర్థుల సత్తా
ఈసారి సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు కూడా మంచి ప్రతిభ కనబరిచారు. మొత్తం నలభైకి పైగా మంది అభ్యర్థులు సివిల్స్లో ర్యాంకులు సాధించి సత్తా చాటారు. గుడెల్లి సృజన, పోలవరపు ద్వానిష్, అట్ల తరుణ్ తేజ, శ్రీగిరిరాజు వీపీఎస్ సాయికృష్ణ, కోలిపాక శ్రీకృష్ణసాయి, బానోత లక్ష్మీ రచన, డీఎస్కే ప్రచేత, ఎస్ వర్షిత రెడ్డి, దొమ్మేటి వినయ్, మాసమ్మగారి పవనకుమార్ రెడ్డి, ఎం వెంకటేష్ ప్రసాద్ సాగర్, రాయలం జయశ్రీ, సునీత, మెరుగు కౌశిక్, అఖిలేష్ గుండు వంటి అభ్యర్థులు మంచి ర్యాంకులు సాధించారు. అలాగే రాపర్తి ప్రీతి, బేతి విక్రమ్, యశ్వంత్, విశాఖ కాదం, మేదర హర్షిత, వెలిమినేటి విక్రమ్ సింహారెడ్డి, కేశబోయిన అఖిల్ సాయినాధ్, శ్వేత గుమ్మల, పల్లి ప్రమోద్ విష్ణు, సాగర్, ఆశిష్ అనిషెట్టి, వెలిమినేటి విజయ్ సింహారెడ్డి, అంగరాజు నవీన వంటి అభ్యర్థులు కూడా ర్యాంకులు సాధించారు. కాదం సునీల్ సుభాష్, పోతుపురెడ్డి భార్గవ్, పుడారి రాహుల్, కుమ్మరి శ్రవణ్ కుమార్, అనిరుధ్ కత్తిమాని, దాయినంపల్లి ప్రవీణ్, కోరపోతుల శ్రీకర్ రాజ్, ఇస్లావత శ్రీరామ్ హర్ష, బానోత భరత కుమార్, సిద్ధార్థ్ రావు గౌతమ్, కట్టా ప్రత్యూష, గోగుల రాజశేఖర్, జితేందర్ నాయక్ గుగులోతు, దీపక్ శర్మ వంటి అభ్యర్థులు కూడా ర్యాంకులు సాధించారు. సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు మంచి ప్రతిభ కనబరచడంతో రెండు రాష్ట్రాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి దేశంలో అత్యున్నత సర్వీసుల్లో చేరే అవకాశాన్ని ఈ అభ్యర్థులు దక్కించుకున్నారు. ఈ ఫలితాలతో సివిల్ సర్వీసెస్లో తెలుగు యువత మరోసారి తమ ప్రతిభను నిరూపించుకున్నారని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యువత పట్టుదలతో ప్రయత్నిస్తే దేశంలో అత్యున్నత స్థానాలు సాధించడం సాధ్యమని ఈ విజయాలు మరోసారి చూపిస్తున్నాయని పేర్కొంటున్నారు.


