యువత క్రీడల్లో రాణించాలి
బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి చెల్మడ లక్ష్మీనరసింహారావు
కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్కు శ్రీకారం
కాకతీయ, వేములవాడ : యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి చెల్మడ లక్ష్మీనరసింహారావు పిలుపునిచ్చారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. వేములవాడ పట్టణంలో నిర్వహించనున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాట్లలో భాగంగా రెండవ బైపాస్లోని క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతకు క్రీడల్లో అవకాశాలు కల్పించడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. వేసవి సెలవుల సమయంలో యువతకు ఇది మంచి వేదికగా నిలుస్తుందని తెలిపారు.
విజేతలకు నగదు బహుమతులు
ప్రథమ బహుమతి ₹50,000, ద్వితీయ బహుమతి ₹25,000 అందజేస్తామని తెలిపారు. అదనంగా షీల్డ్లు కూడా ఇస్తామని పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని 28 వార్డుల నుంచి ప్రతి రెండు వార్డులకు ఒక జట్టు చొప్పున మొత్తం 14 జట్లను ఎంపిక చేసి డ్రా పద్ధతిలో మ్యాచ్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పోటీలను సీనియర్ క్రికెట్ క్రీడాకారుడు పెద్ది రాజు పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏనుగు తిరుపతి రెడ్డి, రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, సిరిగిరి చందు, జోగిని శంకర్ పాల్గొన్నారు. గూడూరు మధు, వాసాల శ్రీనివాస్, గుడిసె సదానందం, రేగుల రాజేశం, మామిండ్ల కనకయ్య, పబ్బ మహేశ్, మిర్యాల సంతోష్, జంగిటి సంజీవ్, మంతెన సందీప్, లింగం రాకేష్ తదితర నాయకులు, క్రీడాకారులు హాజరయ్యారు. టోర్నమెంట్ ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందుతుందని నిర్వాహకులు తెలిపారు.


