రోడ్డు ప్రమాదంలో యువ ఐటీ ఉద్యోగి మృతి
అవయవ దానంతో నాలుగుగురికి జీవం
కాకతీయ, హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన యువకుడు బొగ్గుల రాహుల్ హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. బ్రెయిన్ డెడ్ అయిన రాహుల్ అవయవాలను కుటుంబ సభ్యులు జీవన్దాన్ (తెలంగాణ ప్రభుత్వం)కు దానం చేసి మానవత్వాన్ని చాటారు.

వివరాల్లోకి వెళితే… హుజురాబాద్ పట్టణంలోని వివేకానంద కాలనీకి చెందిన బొగ్గుల రాజేశం–అనురాధ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు రాహుల్ హైదరాబాద్లోని టీసీఎస్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాత్రి నైట్ షిఫ్ట్ పూర్తి చేసి ఆదివారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో తన స్కూటీపై గదికి వెళ్తుండగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి ఎదుట యూ టర్న్ తీసుకునే సమయంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.
అక్కడ ఉన్న స్థానికులు వెంటనే రాహుల్ను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రాహుల్ మొబైల్లోని రీసెంట్ కాల్స్ పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే చికిత్స పొందుతూ రాహుల్ బ్రెయిన్ డెడ్ అయ్యి మృతి చెందాడు.
కుమారుడు మృతి చెందడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు అతని అవయవాలను జీవన్దాన్కు దానం చేయాలని నిర్ణయించారు. రాహుల్ అవయవ దానం ద్వారా మరికొందరికి ప్రాణం నిలుస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా రాహుల్ తండ్రి రాజేశం మాట్లాడుతూ… “నా కుమారుడికి మరణం లేదు. అతని అవయవ దానం ద్వారా మరొకరి ప్రాణం నిలబడుతుంది” అంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు.
అవయవ దానం చేసిన రాహుల్కు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు.


