వామ్మో పెద్దపులి
సిద్ధిపేట జిల్లాలో పెద్దపులి కలకలం
చంద్రునాయక్ తండాలో ఐదు పశువులను చంపిన పులి
కోహెడ మండలం సింగరాయ గుట్టల్లోకి పయనం
వరుస దాడులతో ఆందోళన చెందుతున్న ప్రజలు
మూడు జిల్లాల ప్రజల్లో భయాందోళన
అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు
కాకతీయ, హుస్నాబాద్ : యాదాద్రి భువనగిరి, జనగాం, సిద్ధిపేట జిల్లాల సరిహద్దు ప్రాంతాలు పులి సంచారంతో గడగడలాడుతున్నాయి. కోహెడ మండలం ఆరెపల్లి సమీపంలోని చంద్రునాయక్ తండాలో ఆదివారం తెల్లవారుజామున పులి దాడి చేసి ఐదు పశువులను చంపేయడం తీవ్ర కలకలం రేపింది. బానోతు రమేష్ నాయక్కు చెందిన ఆవులు, ఎద్దులపై జరిగిన ఈ దాడితో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం కోహెడ మండలంలోని సింగరాయ గుట్టల అటవీ ప్రాంతంలో పులి తిరుగుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మోయాతుమ్మెద వాగు పరిసరాల్లో పులి ఆనవాళ్లు కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. తంగళ్లపల్లి–కూరెళ్ల గ్రామాల మధ్య గుట్టల్లో పులి అడుగుల ముద్రలు స్పష్టంగా కనిపించడంతో ప్రజలు మరింత భయపడుతున్నారు. రాత్రి వేళల్లో వినిపిస్తున్న గాండ్రింపు శబ్దాలు గ్రామస్తులను నిద్రపోనివ్వడం లేదు. సాయంత్రం కావడంతోనే గ్రామాలు నిశ్శబ్దంగా మారిపోతున్నాయి. పిల్లలు, మహిళలు బయటకు రావడానికే వెనుకంజ వేస్తున్నారు. రైతులు పొలాలకు వెళ్లేందుకు కూడా భయపడే పరిస్థితి నెలకొంది.

పశువులపై దాడితో పెరిగిన భయం
చంద్రునాయక్ తండా పరిధిలో జరిగిన పశువులపై దాడి ఘటన ప్రజలను తీవ్రంగా కలవరపెట్టింది. పొలాల వద్ద మిగిలిన అవశేషాలను చూసి గ్రామస్తులు వణికిపోయారు. రాత్రివేళల్లో పశువుల అరుపులు, పులి గాండ్రింపులు కలిసి వినిపించడంతో ప్రజలు ఇళ్లలోనే తలుపులు మూసుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. “పులి చాలా దగ్గరలోనే తిరుగుతోంది” అన్న సమాచారం వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఎప్పుడు ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక ప్రజలు ఆందోళనతో గడుపుతున్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన అటవీ, పోలీసు శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. హుస్నాబాద్ అటవీ రేంజర్ సిద్ధార్థ్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కోహెడ సబ్ ఇన్స్పెక్టర్ అభిలాష్ గ్రామాలను సందర్శించి ప్రజలకు భద్రతా సూచనలు ఇచ్చారు. దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. పులి ఎక్కువగా మట్టి రోడ్లపై సంచరిస్తోందని అధికారులు గుర్తించారు. అలాంటి ప్రాంతాల్లో అలజడి కనిపిస్తే వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లి అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాత్రివేళల్లో ఒంటరిగా బయట తిరగవద్దని, గుంపులుగా మాత్రమే వెళ్లాలని హెచ్చరించారు. పశువులను పొలాల వద్ద వదిలేయకుండా గ్రామాల్లోకి తీసుకురావాలని, రాత్రి వేళల్లో జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. పులి కనిపిస్తే ఫోటోలు, వీడియోలు తీయడానికి ప్రయత్నించవద్దని, అలా చేయడం ప్రాణాలకు ప్రమాదకరమని స్పష్టం చేశారు. పులిని రెచ్చగొట్టే చర్యలు చేస్తే దాడి చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అటవీ శాఖ పెట్రోలింగ్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాయని అధికారులు తెలిపారు. పులి కదలికలు గమనించిన వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. ప్రస్తుతం గ్రామాల్లో భయాందోళన వాతావరణం కొనసాగుతోంది. పిల్లలను బయటకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. రైతులు పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అటవీ శాఖ పులిని గుర్తించి పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సంచారం ఆగకపోవడంతో ప్రజల్లో ఆందోళన ఇంకా తగ్గడం లేదు.



