మహిళల రక్షణ సామాజిక బాధ్యత
యువత మహిళా రక్షణకు బ్రాండ్ అంబాసిడర్ కావాలి
మహిళలకు బాధ్యతలు అప్పగించడంలో కాంగ్రెస్ ముందు
మహిళలకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పిస్తున్నాం
అన్ని రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
“స్టాండ్ విత్ హర్” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాకతీయ, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడంతోనే మన బాధ్యత పూర్తికాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళల గౌరవం, భద్రతను కాపాడటం సమాజం మొత్తం బాధ్యతగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. “స్టాండ్ విత్ హర్” కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మహిళల భద్రత, సాధికారతపై ప్రభుత్వ దృక్పథాన్ని వివరించారు. దేశానికి రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, లోక్ సభ స్పీకర్గా, ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన గుర్తు చేశారు. మహిళల సామర్థ్యాన్ని గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. తెలంగాణలో కూడా మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. మహిళను మనం శక్తితో పోలుస్తామని, అలాంటి మహిళకు రక్షణ కల్పించలేకపోతే ఏ రాష్ట్రానికైనా గౌరవం ఉండదని ఆయన అన్నారు. గతంలో మహిళలపై వేధింపులు కొంతవరకే పరిమితమయ్యేవని, కానీ ఇప్పుడు సాంకేతిక అభివృద్ధితో సోషల్ మీడియాలో కూడా వేధింపులు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు.
సామాజిక బాధ్యతగా చూడాలి..!
మహిళల రక్షణ కోసం చట్టాలు చేయడం, పోలీసులు పర్యవేక్షించడం మాత్రమే సరిపోదని ముఖ్యమంత్రి అన్నారు. సమాజం మొత్తం బాధ్యతగా భావించి ముందుకు వస్తేనే మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టగలమని చెప్పారు. మన ఇంటి ఆడబిడ్డలకు ఎలాంటి గౌరవం ఇస్తామో, సమాజంలో ఉన్న ప్రతి ఆడబిడ్డను కూడా అదే గౌరవంతో చూడాలని ఆయన సూచించారు. ప్రతి యువకుడు మహిళా రక్షణకు బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరుతోనే అందిస్తున్నామని చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించి వారికి వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. శిల్పారామం వద్ద దుకాణ సముదాయాలు కేటాయించి మహిళలు స్వయం ఉపాధితో ఎదిగేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ మహిళలు పెద్ద పారిశ్రామిక వేత్తలతో పోటీ పడే స్థాయికి ఎదగాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు వెయ్యి బస్సులకు మహిళలను యజమానులుగా చేసే కార్యక్రమం కూడా చేపట్టామని తెలిపారు. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం ద్వారా మహిళా శక్తికి గౌరవం తెలిపామని చెప్పారు. మహిళా శక్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందని ఆయన అన్నారు. దేశంలోనే తెలంగాణను మహిళలకు అత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో “స్టాండ్ విత్ హర్” కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని చెప్పారు. సోషల్ మీడియా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని, మహిళలపై అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరూ “స్టాండ్ విత్ హర్” అంటూ ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


