మహిళలకు సమ న్యాయం కావాలి..!
ప్రతి రంగంలో సమానత్వం అవసరం
టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు
కాకతీయ, ఖమ్మం : మహిళలకు పనిచేసే చోటు నుంచి సమాజంలోని ప్రతి రంగంలో సమాన హక్కులు, సమాన న్యాయం ఉండాలని టీజీవో నాయకులు అన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో టీజీవో భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు, కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహిళా విభాగం కార్యదర్శి పి సుధారాణి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలకు సమాన వేతనం, విద్య, రక్షణ కల్పించడమే మహిళా దినోత్సవం లక్ష్యమన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల కోసం నిరంతరం పోరాడే స్ఫూర్తిని ఈ రోజు కల్పిస్తుందన్నారు. అనంతరం మహిళా అధికారులను సన్మానించి కేక్ కట్ చేశారు. తరువాత వృద్ధాశ్రమంలో మహిళలకు పండ్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా అధికారులు, సంఘ నాయకులు పాల్గొన్నారు.


