సమాజ అభివృద్ధికి మహిళలే బలం
జిల్లా కలెక్టర్ అంకిత్
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
కాకతీయ, కొత్తగూడెం : సమాజ అభివృద్ధిలో మహిళలు ముందుండి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ అంకిత్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి విద్య ఎంతో కీలకమని అన్నారు. విద్యావంతురాలైన మహిళ అన్ని రంగాల్లో తన ప్రతిభను చాటుకుని ఉన్నత స్థాయికి ఎదగగలదని తెలిపారు. సమాజ పురోగతిలో మహిళల పాత్ర అత్యంత ముఖ్యమని చెప్పారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటిలో చాలా పథకాలు మహిళల పేరుమీదే మంజూరు అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి రంగంలో మహిళలు ముందుకు వచ్చి తమ సామర్థ్యాలను నిరూపించాలని కోరారు. మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ మహిళల పట్ల లింగ వివక్ష కుటుంబ వ్యవస్థ నుంచే తొలగాలని అన్నారు. తల్లిదండ్రుల ఆలోచన మారితేనే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా మాట్లాడుతూ బాలికల విద్య, భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన మహిళలను సన్మానించారు.


