కృషి పట్టుదల క్రమశిక్షణతో ఏదైనా సాధించగలం
* రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య
కాకతీయ, చేర్యాల: కృషి పట్టుదల క్రమశిక్షణతో ఏదైనా సాధించగలమని రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య అన్నారు. మండలంలోని రాంపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతి గదుల్లో తోటి విద్యార్థులకు విద్యాబోధన చేసి ఆకట్టుకున్నారు.విద్యా బోధన చేయడంలో ఉపాధ్యాయులు ఎంత కష్టపడుతున్నారో ఈరోజు తెలుసుకున్నామని, గురువుల మాటలు వింటే లక్ష్యాన్ని అందుకోవచ్చని పలువురు విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ శెట్టే కొమురయ్య మాట్లాడుతూ..విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసేందుకు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఉపకరిస్తాయన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే అనుకున్న లక్ష్యం సాధిస్తారని అన్నారు.కృషి,పట్టుదల, క్రమశిక్షణ ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదని సర్పంచ్ విద్యార్థులకు సూచించారు.స్వయం పరిపాలన దినోత్సవం లో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులుగా తమ కర్తవ్యాన్ని వేషధారణంగా గావించి ఒక్కరోజు స్వపరిపరిపాలన దినోత్సవాన్ని కొనసాగించారు.విద్యార్థులే ఉపాధ్యాయులుగా చక్కటి పాఠశాలను బోధించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్పంచ్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వేణు, ఉపాధ్యాయురాలు నందిని, ఉప సర్పంచ్ నిమ్మ లక్ష్మారెడ్డి, అంగన్వాడి ఉపాధ్యాయులు బండ సుజాత, పంచాయతీ కార్యదర్శి మధు, రంగు సువర్ణ తో పాటు విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


