ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో వివక్ష ఎందుకు?
నల్లబెల్లినే టార్గెట్ చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు
కెనాల్ హద్దుల నిర్ణయంలో అధికారుల ఏకపక్ష ధోరణి
ఒక్క గ్రామానికే పరిమితమై మార్కింగ్ అన్యాయం
నోటీసులతో రైతులు, ప్రజల్లో భయాందోళనలు
బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుంది
నల్లబెల్లి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి
కాకతీయ, నల్లబెల్లి : ఎస్సారెస్పీ డీబీఎం–38 కెనాల్ భూముల పరిరక్షణ విషయంలో ఇరిగేషన్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి తీవ్ర విమర్శలు చేశారు. శనివారం నల్లబెల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గీసుకొండ నుంచి భూపాలపల్లి జిల్లా వరకు విస్తరించి ఉన్న కెనాల్కు సంబంధించి, అధికారులు కేవలం నల్లబెల్లి గ్రామానికే పరిమితమై హద్దుల మార్కింగ్ చేపట్టడం అన్యాయమని సారంగపాణి అన్నారు. కెనాల్ ప్రారంభం నుంచి చివరి వరకు రైట్, లెఫ్ట్ హద్దులను శాస్త్రీయంగా, సమగ్రంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ కోణం ఉందా?
పట్టా భూములు కలిగిన రైతులను, ఎన్నేళ్లుగా నివసిస్తున్న సామాన్య ప్రజలను నోటీసులతో భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లినే లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు చేపట్టడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. కేవలం కొంతమందికే నోటీసులు జారీ చేయడంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలువ భూముల పరిరక్షణకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, పట్టాదారుల నుంచి భూములు కొనుగోలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. నిబంధనల పేరుతో ఒక్క ప్రాంతాన్నే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు తమ వైఖరి మార్చుకోకపోతే బాధితుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలిపారు. సమావేశంలో కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ శ్రీనివాస్ గుప్తా, జన్నుజయరావు, గుండాల కుమారస్వామి, సర్పంచులు నాగెళ్ళి జ్యోతిప్రకాశ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్, ఉపసర్పంచ్ గుమ్మడి వేణు తదితరులు పాల్గొన్నారు.


