“ఆది” అండ ఎవరికో?
వేములవాడ మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ
కీలకంగా మారిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిర్ణయం
ఎమ్మెల్యేకు సవాల్గా మారిన పదవులు పందేరం
పాత, కొత్త నేతల మధ్య సమన్వయం సాధ్యమేనా?
వైస్ చైర్మన్ స్థానానికి సైతం పోటా పోటీ
మరికొద్ది గంటల్లోనే ఉత్కంఠకు తెర
కాకతీయ, రాజన్న సిరిసిల్ల: “ఆది అండ ఎవరికి..? ఇదే ఇప్పుడు వేములవాడ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్లో అంతర్గత సమీకరణాలు ఊపందుకున్నాయి. 28 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 13, బీజేపీ 8, బీఆర్ఎస్ 5 స్థానాలు గెలుచుకోగా ఇద్దరు స్వతంత్రులు విజయం సాధించారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో చైర్మన్ ఎన్నిక సస్పెన్స్గా మారింది. అయితే తాజా పరిణామాల్లో ఇద్దరు స్వతంత్రులు, బీఆర్ఎస్కు చెందిన ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ గూటికి చేరడంతో అధికార కాంగ్రెస్ బలం 16కు పెరిగింది. దీంతో చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం దాదాపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికి దక్కనుంది..? అనేదే ఇప్పుడు వేములవాడ పట్టణంలో ఉత్కంఠను రేపుతోంది.
చైర్మన్ రేసులో ఆ నలుగురు
కాంగ్రెస్ తరఫున చైర్మన్ రేసులో పుల్కం రాజు, ఇప్పపూల మమత, తుమ్ మధు, కొక్కుల బాలకృష్ణయ్య పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సీనియారిటీ ఆధారంగా పుల్కం రాజుకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే మహిళా కోణంలో మమతకు అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతోంది. తుమ్ మధు పేరు కూడా గట్టిగా వినిపిస్తుండగా తాజాగా కొక్కుల బాలకృష్ణయ్య పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిర్ణయంపైనే చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ఆధారపడి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వైస్ చైర్మన్ సీటూ హాట్
చైర్మన్ పరిస్థితి ఇలా ఉంటే వైస్ చైర్మన్ పదవికి కూడా పోటీ తీవ్రంగా మారింది. మొదట్లో పెద్దగా ఆసక్తి లేకపోయినా తాజా చేరికలతో వైస్ చైర్మన్ సీటు కూడా కీలకంగా మారింది. కొత్తగా పార్టీలో చేరిన నరాల శేఖర్, కుమ్మరి శిరీష, ఎల్ శ్రీనివాస్ వైస్ చైర్మన్ పదవి కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. తమ రాకతోనే కాంగ్రెస్కు మెజారిటీ సాధ్యమైందని, అందువల్ల తమకు పదవి కేటాయించాలని క్యాంప్లోనే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో “ఆది అండ ఎవరికి?” అన్నదే కీలకంగా మారింది.
సమతుల్యతే సవాల్
వేములవాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు చైర్మన్ ఎంపిక పెద్ద సవాల్గా మారింది. ఒకవైపు మొదటి నుండి పార్టీలో పనిచేసిన నేతలు, మరోవైపు కీలక సమయంలో పార్టీలో చేరి మెజారిటీ సాధ్యంచేసిన నాయకులు ఈ రెండు వర్గాల మధ్య సమతుల్యత సాధించడం ఆది శ్రీనివాస్కు పరీక్షగా మారింది. ఈ క్రమంలో అసమ్మతి తలెత్తకుండా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
మరికొన్ని గంటల్లో క్లారిటీ
మున్సిపల్ ఫలితాల అనంతరం కాంగ్రెస్ కౌన్సిలర్లు హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్లో క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సోమవారం అక్కడి నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ప్రమాణ స్వీకారం చేసి, అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారు అనే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.


