రాసింది కరెక్టే.. రాయకుంటే బాగుండు !
ఇదీ ఆయుర్వేద వైద్య కళాశాల అధికారుల తీరు
‘కాకతీయ’ కథనంపై భినాభిప్రాయాలు
రాజకీయ, విద్యార్థి నాయకులతో బెదిరింపు ధోరణిలో ఫోన్ కాల్స్
కళాశాల పరిస్థితులపై వరంగల్ కలెక్టర్ ఆరా !
అన్ని సక్రమంగానే ఉన్నట్లు విద్యార్థులతో బలవంతంగా సంతకాల సేకరణ
ఆ భయంతోనే అసౌకర్యాలపై ఇంతకాలం ప్రశ్నించలేకపోయిన విద్యార్థులు
ఫెయిల్ చేస్తారనే ఆందోళనతో అరకొర వసతుల నడుమే కాలం వెళ్లదీత
కాకతీయ, వరంగల్ : ‘తిట్టను పోరా.. మల్లిగా’ అన్నట్లు ఉంది వరంగల్ ఆయుర్వేద వైద్య కళాశాల తీరుపై పలువురి వాదన. కాలేజీలో అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయనే కథనంపై అధ్యాపకులు, విద్యార్థులు తలోరకంగా చర్చించుకోవడం ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ప్రజా సమస్యలు, విద్యార్థుల అవస్థలపై పోరాటం చేయగలిగే పార్టీలు సైతం.. కథనం పట్ల స్పందించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. జాతకం అంతా బాగానే ఉంది.. శనిగ్రహం వక్రంగా చూస్తున్నాదని అయ్యగార్లు చెప్పినట్లుగా ఒక్కొక్కరి వాదన అయోమయానికి గురి చేస్తోంది.
అసలేం జరిగిందంటే!
వరంగల్ నగరంలో లేబర్ కాలనీ ఏరియాలో అనంతలక్ష్మి పేరిట ఆయుర్వేద వైద్య కళాశాల నలభై ఏళ్ల నుంచి కొనసాగుతోంది. దాతలు ఇచ్చిన స్థలంలో నాలుగైదు భవనాల్లో తరగతులు, ఆఫీసు కార్యకలాపాలు సాగుతున్నాయి. అయితే, ఆ భవనాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరినట్లు కళ్లకు కడుతున్నాయి. ఒక భవనం కొత్తగా నిర్మించినా నిర్వహణ లోపంతో అధ్వానంగా తయారైంది. ఇక హాస్టల్లో పరిస్థితులు దారుణంగా దర్శనమిస్తున్నాయి. రెండు ఫ్లోర్లుగా ఉన్న హాస్టల్ కింది భాగంలో వంట గది తీరు దారుణంగా ఉంది. విద్యార్థులకు తాగునీటి వసతి కూడా అంతంతమాత్రమే. వంటగది పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఇక కరెంట్ పోతే.. కింది పోర్షన్ లో చీకట్లు అలుముకునే పరిస్థితులు కనిపించాయి. మరో భవనం ముందు ఏర్పాటు చేసిన పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. అదే భవనం పైకప్పు పెచ్చులూడిపోయాయి. కాలేజీ ఆవరణ మొత్తం చెత్తాచెదారంతో నిండి ఉంది. ఇవే పరిస్థితులను ‘కాకతీయ’ దినపత్రిక ఫొటోలతో సహా ముద్రించింది. అలాగే, కాలేజీ, హాస్టల్ నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని ప్రచురించింది. అందుకు నిధులు లేకపోవడమే కారణమని వెల్లడించింది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్పష్టం చేసింది.

రాసింది కరెక్టే కానీ!
దాతల సహకారం ఉంటే గానీ అనంతలక్ష్మి ఆయుర్వేద కాలేజీ మెరుగుపడేలా లేదని కాకతీయ దినపత్రిక వాస్తవ పరిస్థితులను వివరించే ప్రయత్నం చేసింది. అయితే, దీనిపై కొందరు వివిధ రకాలుగా స్పందించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొందరు కాకతీయ దినపత్రిక ప్రతినిధికి ఫోన్ చేసి.. తమ అభిప్రాయాలను వెల్లడించడం గమనార్హం. రాసింది 90 శాతం కరెక్టే గానీ, అధ్యాపకులు ఆ కాలేజీకి పలు రకాలు సేవలు అందిస్తున్నారని పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని ఒక పక్క అధ్యాపకులే చెబుతున్నారు. మళ్లీ అధ్యాపకులే సేవ చేస్తున్నారని ఓ రాజకీయ నాయకుడు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ అధ్యాపకులు కాలేజీ కోసం సేవలు అందిస్తున్నా.. ఆర్థిక అవసరాలకు వారి జేబులో నుంచి పెడుతున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకపక్క విద్యార్థుల నుంచి హాస్టల్ మెయింటనెన్స్ కోసం అడ్మిషన్ల సమయంలో ఏటా 16 వేలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో నుంచి హాస్టల్ కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నామని, ఇతర మైనర్ రిపేర్లు చేయిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇక ఇతరత్రా నిర్వహణకు దాతలు ముందుకొస్తే గానీ, పనులు సాగేలా లేవనేది స్పష్టమవుతోంది. ఈ క్రమంలో అధ్యాపకులు సేవలు చేస్తున్నారంటే.. సందేహాలు కలుగుతున్నాయి.
కలెక్టర్ ఆదేశాలతో సంతకాల సేకరణ!
ఇదిలా ఉండగా, కాకతీయ దినపత్రిక కథనాలతో కలెక్టర్ స్పందించినట్లు తెలిసింది. ఆయుర్వేద వైద్య కళాశాల స్థితిగతులపై కలెక్టర్ ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, అధ్యాపకులు వాస్తవ పరిస్థితులను కలెక్టర్కు నివేదించకుండా అన్ని బాగానే ఉన్నట్లు లేఖ తయారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆ లేఖ మీద విద్యార్థులతో బలవంతంగా సంతకాలు సేకరించినట్లు తెలుస్తోంది. నిజానికి కలెక్టర్ ఈ కథనంపై స్పందించి ఉంటే.. జిల్లా అధికారిగా నగరంలోనే ఉన్న ఆ కళాశాలను సందర్శించే వారు. అలా కాకుండా కలెక్టర్ కాలేజీ అధ్యాపకులపై సీరియస్ కావడంతో వారు పరిస్థితులను దాచిపెట్టి.. అన్ని సవ్యంగానే ఉన్నట్లు లేఖ సిద్ధం చేయడం ఆయుర్వేద వైద్య విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. భవనం శిథిలావస్థకు చేరుకుంది నిజం కాదా? రేకుల షెడ్డు ధ్వంసమైంది అబద్ధమా? హాస్టల్లో మట్టికుప్ప వాస్తవం కాదా? కరెంట్ పోతే చీకట్లు నెలకొనే దుస్థితి లేదా? కొత్త బిల్డింగ్ అపరిశుభ్ర వాతావరణం ఉన్నది అవాస్తవమా? విద్యార్థులకు స్కాలర్షిప్ లు పెండింగ్ ఉన్నది నిజం కాదా? కాలేజీలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నది అబద్ధమా? ఇన్ని సమ్యలుంటే… అన్ని సవ్యంగానే ఉన్నాయని అధ్యాపకులు లేఖ రాయడం, ఆపై విద్యార్థులతో సంతకాలు సేకరించడం వెనుక ఆంతర్యమేమిటో జిల్లా యంత్రాంగమే వెల్లడించాలి. లేదంటే ఎంజీఎం ఆస్పత్రి ఎదుర్కొంటున్న పరిస్థితులే.. ఆయుర్వేద వైద్య విద్య కాలేజీకి పట్టే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా అధ్యాపకులు వాస్తవ పరిస్థితులను కలెక్టర్ కు నివేదించాలి. అవసరమైతే కలెక్టర్ స్వయంగా కాలేజీని సందర్శించి… విద్యార్థులతో అధ్యాపకులు లేకుండా చర్చించి, నిజానిజాలను ప్రభుత్వానికి నివేదించాల్సి అవసరం ఉంది


