పరకాలకు పదేళ్లలో చేసింది శూన్యం
జిల్లా కేంద్రం అవకాశాన్ని చేజేతులా చేజార్చారు
వ్యాపారాలకే పరిమితమైన అప్పటి ఎమ్మెల్యే
టీఆర్ఎస్ పాలనలో లాభపడింది ఒక కుటుంబమే
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేయాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలపు
కాకతీయ, పరకాల : పదేళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగిన చల్లా ధర్మారెడ్డి పరకాల పట్టణ అభివృద్ధికి ఏమాత్రం సేవ చేయలేదని, ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ బీఆర్ఎస్ పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలో మాజీ ఎమ్మెల్యే మొలుగురు బిక్షపతి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దొంబాటి సాంబయ్యతో కలిసి ప్రచారం నిర్వహించిన రేవూరి ప్రకాష్రెడ్డి, గత ప్రభుత్వ హయాంలో పరకాల ప్రజలకు జరిగిన అన్యాయాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పరకాలను జిల్లా కేంద్రంగా చేయాలనే చర్చలు తీవ్రంగా జరుగుతున్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి తన వ్యాపారాల కోసం శ్రీలంకకు వెళ్లిపోయారని ఆరోపించారు. “పరకాల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన కీలక సమయంలో ప్రజలను పట్టించుకోకుండా విదేశాలకు వెళ్లిన నాయకుడు, పట్టణాభివృద్ధికి ఏం చేస్తాడు?” అని ప్రశ్నించారు. పదేళ్ల కాలంలో పరకాలకు కొత్త ప్రాజెక్టులు తీసుకురావడంలో, మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితమై ప్రజల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు.
ప్రజలు కాదు – బీఆర్ఎస్ కుటుంబమే బాగుపడింది
తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల టీఆర్ఎస్ పాలనలో సామాన్య ప్రజలు ఎవ్వరూ బాగుపడలేదని, ఆ పార్టీకి చెందిన ఒకే కుటుంబం మాత్రం కోట్లకు పడగలెత్తిందని ఎమ్మెల్యే రేవూరి ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, పేదవర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. “టీఆర్ఎస్ నేతలు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప ప్రజల సంక్షేమం కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. పరకాలలో అభివృద్ధి జరిగింది అనేది నిజం కాదు. జరిగింది అంతా కాగితాలపైనే” అని మండిపడ్డారు.
‘ముసలివాడంటూ’ అవమానించారు
ఎన్నికల సమయంలో తనను చల్లా ధర్మారెడ్డి ‘75 ఏళ్ల ముసలివాడు, ఏం చేస్తాడు’ అంటూ అవమానించారని ఎమ్మెల్యే రేవూరి గుర్తు చేశారు. కానీ ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపించిన తర్వాత రెండేళ్లుగా నిర్విరామంగా పరకాల అభివృద్ధికే కట్టుబడి పనిచేస్తున్నానని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరుగుతున్నాయని వివరించారు. గత పాలనలో ఏ పని జరగలేదని, ఇప్పుడు మాత్రం అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే పరకాలను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయాలనే నిజమైన తపన ఉన్న నాయకులు కాంగ్రెస్లోనే ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సమయంలో మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారని పార్టీ నాయకులు తెలిపారు.


