ఆ హీరో చేష్టలతో షాక్ గురయ్యా
కాకతీయ, సినిమా డెస్క్ : టాలీవుడ్తో పాటు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న పూజ హెగ్డే తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడంతో, ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఇంటర్వ్యూలో పూజ హెగ్డే మాట్లాడుతూ… తన కెరీర్ బిగినింగ్లోనే ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో అవకాశం వచ్చింది. ఆ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్టార్ హీరోతో ఉండటంతో చాలా ఆనందంగా ఒప్పుకున్నా. అయితే షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన తనను తీవ్రంగా కలచివేసింది. “ఆ సినిమా షూటింగ్ సమయంలో నా అనుమతి లేకుండానే ఆ హీరో నా క్యారవాన్లోకి వచ్చాడు. అప్పటికే అది నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. ఆ తర్వాత అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ క్షణంలో నాకు ఏమి చేయాలో కూడా అర్థం కాలేదు. చాలా షాక్కు గురయ్యా” అని పూజ చెప్పింది. ఆ పరిస్థితిని తట్టుకోలేకపోయిన తాను సహనం కోల్పోయానని, వెంటనే అతడిని లాగిపెట్టి కొట్టానని సంచలన వ్యాఖ్యలు చేసింది. “అలా చేయగానే అతడు వెంటనే క్యారవాన్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడితో కలిసి నటించాలనే ఆసక్తి నాకు పూర్తిగా పోయింది. అందుకే నా సీన్స్ను డూప్తో షూట్ చేశారు” అని ఆమె వివరించింది.


