సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
గ్రామ సభలతో సమస్యలకు పరిష్కారం
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, సంగెం: సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గ్రామ సభల ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించడం సాధ్యమవుతుందని తెలిపారు. సంగెం మండలంలోని గవిచర్ల గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామసర్పంచ్ బాషిపాక సదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు పథకాల వివరాలను గ్రామస్తులకు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని వినిపించారు.
గ్రామాభివృద్ధికి గ్రామసభలే వేదిక
గ్రామసభలు గ్రామాభివృద్ధికి కీలకమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలను గ్రామస్థాయిలోనే చర్చించి పరిష్కరించేందుకు ఇవి వేదికగా నిలుస్తాయని అన్నారు. ప్రతి గ్రామస్థుడు గ్రామసభల్లో పాల్గొని తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు. సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం, గృహ జ్యోతి, సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, రేషన్ కార్డులు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. గవిచర్ల గ్రామానికి ఇప్పటికే రూ.25 కోట్లకు పైగా లబ్ధి అందిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజకుమార్, మండల స్థాయి అధికారులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


