*రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
*23న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2లో బలమైన వాదనలు వినిపిస్తాం
*తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను వదులుకోం
*తాగు, సాగు నీటితో సహా పరిశ్రమల నీటి వినియోగానికి చర్యలు
*71%నీటి వాటకై గట్టిపట్టు పడుతాం..
*65% తెలంగాణ ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలని ఇప్పటికే కేడబ్ల్యూడీటీ ముందుంచాం
*తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న ఆంధ్రప్రదేశ్..!
*నేను, సీఎం రేవంత్ రెడ్డి ఈ చర్చలలో పాల్గొంటాం.!
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాల వివాద-2 విచారణలో తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 23 న జరగనున్న ఈ చర్చల్లో తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తామని చెప్పారు. తెలంగాణాకు చెందాల్సిన నీటివాటలో చుక్క నీరు కుడా వదులుకునే ప్రసక్తేలేదని ఆయన తేల్చి చెప్పారు.
ఈ నెల 23 నుంచి 25 వరకు దేశరాజధాని ఢిల్లీలో జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తాను స్వయంగా పాల్గొన బోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీలో 23 నుంచి 25 వరకు జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2 విచారణలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించాల్సిన అంశంపై శనివారం నీటిపారుదల శాఖా కేంద్ర కార్యాలయం జలసౌధ లో న్యాయనిపుణులు,నీటిపారుదల రంగ నిపుణులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
నీటిపారుదల శాఖా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,ఇ. ఎన్.సి అంజద్ హుస్సేన్ సుప్రీంకోర్టు న్యాయవాది సి.ఎస్ వైద్యనాథ్,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇదే అంశంపై ఒత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీకి చేరుకుని సమీక్షిస్తారని వెల్లడించారు. కృష్ణా జలాశయాల్లో తెలంగాణ రాష్ట్ర వాటాను సాధించేందుకు బలమైన వాదనలు వినిపించేందుకు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని అన్నారు. వారిచ్చే నివేదికల ఆధారంగా న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రానికి చెందాల్సిన నీటివాటాపై వాదనలు వినిపించనున్నారని ఆయన పేర్కొన్నారు.
శాస్త్రీయంగా నీటి కేటాయింపులపై గతంలోనే వినతులు
కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2 ఎదుట 2025 ఫిబ్రవరి నుంచి వాదనలు కొనసాగాయని అన్నారు.
సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయంపై ప్రస్తావించారని ఆయన తెలిపారు. శాస్త్రీయంగా నీటి కేటాయింపులు, ఆంధ్రప్రదేశ్ చేపట్టిన అనధికార బేసిన్ల వివరాలు, తెలంగాణ ప్రాంతంలో సాగునీటి అవసరాలు అందులో పొందు పర్చానన్నారు. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలువల సామర్థ్యాలను పెంచుకుంటూ గోదావరి, పట్టిసీమ, చింతలపూడి, పులిచింతల నీరు అక్రమంగా తరలించుకు పోతున్న అంశాలను ఇప్పటికే ట్రిబ్యునల్ ముందు ఉంచామన్నారు.
1956 జలవివాద చట్టం,2014 ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిన విషయంపై వాదనలు వినిపించామన్నారు. 811 టీఎంసీల కృష్ణా జలాశయాలలో తెలంగాణ ప్రాంతానికి 71 శాతం కేటాయింపులు ఉండాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు 65% కేటాయింపులు ఉండాల్సిందేనన్నారు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లుగా నీటి కేటాయింపులు ఉండాలని అందుకు అనుగుణంగా తాజా సమాచారాన్ని ట్రిబ్యునల్ కు సమర్పించామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని జారవిడుచుకోబోమని మంత్రి పునరుద్ఘాటించారు.
80 టీఎంసీల అందుబాటులో ఉంచేలా వాదనలు వినిపిస్తాం
తాజాగా అధికారులు అందిస్తున్న నివేదికల ప్రకారం జూన్, జులై మాసాలలో ఇక్కడికి అవసరమైన నీటి కోసం 80 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచేలా వాదనలు వినిపించాలని నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. ఆపరేషన్ ప్రొటోకాల్ నిబంధనల ననుసరించి మిగిలిన నీటిని వినియోగించుకునే స్వేచ్ఛ తెలంగాణాకు ఉండేలా ట్రిబ్యునల్ ముందట ఉంచుతామన్నారు. ఐఎస్ఆర్.డబ్ల్యుడీ చట్టంలోని సెక్షన్ 4(1) ఏతో పాటు పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదకొండో షెడ్యూల్ పదో పేరాగ్రాఫ్ వంటి న్యాయపరమైన అంశాలను కుడా ఈ విచారణలో వాదించబోతున్నట్లు ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా వినియోగిస్తున్న 291 టీఎంసీల నీటి ఉదంతం వెలుగులోకి వచ్చినందున ఆ నీటిని పునర్విభజన చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న ఆంధ్రప్రదేశ్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులపై అడ్డుపడుతుండడంతో ఒకింత ఆలస్యం జరుగుతోందని ఉత్తమ్కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రాజెక్ట్ ల నిర్మాణాలపై తెలంగాణా కు ఉన్న హక్కులను కుడా ట్రిబ్యునల్ ఎదుట జరిగే వాదనలలో వినిపిస్తామన్నారు. తమ వాదనలకు బలం చేకూరేలా ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణాల అంశాలతో కూడిన ప్రత్యేక జీ.ఓను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సన్నద్దమవుతోందన్నారు. వీటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపుతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం తాగునీటి అవసరాల కోసం కొత్తగా నిర్మిస్తున్న రిజర్వాయర్ లు,100 టీఎంసీలను మళ్లించడానికి వీలుగా రూపకల్పన చేసిన జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్లు ఉన్నాయన్నారు.
ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తి చేయక పోవడం వల్లనే కృష్ణా జలాశయాలను తెలంగాణా వినియోగించుకో లేకపోయిందని ఆయన బీఆర్ఎస్ పాలకులపై మండిపడ్డారు. గత పాలకుల ఉదాసీనతతోటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుని పోయి ప్రయోజనం పొందిందని బీఆర్ఎస్ పాలకులపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే న్యాయంగా తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై గట్టిపట్టు పడుతు న్నామన్నారు. అందుకు తగిన ప్రణాళికలు రూపొందించి ముందుకు పోతున్నామన్నారు.


