కాంగ్రెస్ గూండాల అరాచకాలు సహించం
దాడులకు ప్రతిదాడులు తప్పవు
బిట్ల బాలరాజు, ఆయన భార్య భారతిల పరిస్థితి విషమం
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పోలీసుల తీరుపై ఆగ్రహం
కాకతీయ,హైదరాబాద్ : కాంగ్రెస్ గూండాల అరాచకాలను ఇకపై ఉపేక్షించబోమని, అవసరమైతే దాడికి ప్రతిదాడి తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసుల వ్యవహార శైలిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం సోమార్పేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు బిట్ల బాలరాజు,ఆయన భార్య గంజి భారతి లను సోమవారం కేటీఆర్ పరామర్శించారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్తో కలిసి ఆసుపత్రికి వెళ్లిన ఆయన, బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
బాధితురాలి పరిస్థితి విషమం
దాడిలో గాయపడిన గంజి భారతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పెల్విస్ ఎముకలు విరిగిపోయాయని, యూరినరీ బ్లాడర్ దెబ్బతిన్నట్లు డాక్టర్లు తెలిపారని చెప్పారు. మూడు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉందని, కనీసం మూడు వారాల పాటు ఆసుపత్రిలోనే చికిత్స కొనసాగాల్సిన పరిస్థితి ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో పోలీసుల తీరు అమానవీయంగా మారిందని కేటీఆర్ మండిపడ్డారు. “డీజీపీ నుంచి కింది స్థాయి అధికారుల వరకూ గుర్తుంచుకోవాలి. మీ జీతాలు ప్రజల సొమ్ముతోనే వస్తాయి. రేవంత్ రెడ్డి ఇంటి సొమ్ముతో గానీ, కాంగ్రెస్ పార్టీ సొమ్ముతో గానీ కాదు. ప్రజల ప్రాణాలు పోతుంటే, రౌడీలు దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం సరికాదు” అని హెచ్చరించారు.
దాడికి ప్రతిదాడి తప్పదు
నిందితులపై చర్యలు తీసుకోకుండా పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తే తామూ తిరగబడాల్సి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. “ఇక దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి” అని అన్నారు. దాడి చేసిన వారితో పాటు దాడికి ప్రేరేపించిన వారిపై కూడా వెంటనే ‘అటెంప్ట్ టు మర్డర్’ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి తక్షణమే ఆర్థిక సహాయం, నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. నల్గొండలో మల్లయ్య యాదవ్ హత్య, సూర్యాపేటలో బీసీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన ఘటనలను ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో సమాధానం చెబుతారని అన్నారు. గాయపడిన భారతి కుటుంబానికి, ఇతర కార్యకర్తలకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులను బీఆర్ఎస్ పార్టీనే భరిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, అవసరమైతే డీజీపీ, ఎస్పీ కార్యాలయాల ముట్టడికైనా పిలుపునిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. సీఎం తన భాషతో కార్యకర్తలను రెచ్చగొట్టడం మానుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు “ఖబడ్దార్ కాంగ్రెస్ గూండాలారా” అంటూ నినాదాలు చేశాయి.


