వెన్నుపోటు రాజకీయాలు సహించబోము-మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్గా ఎన్నికైన చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి సన్మాన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని కాంగ్రెస్ కౌన్సిలర్లను అభినందించారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన కౌన్సిలర్లందరినీ శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి సీతక్క మాట్లాడుతూ, ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రతి కార్యకర్తకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి చైర్పర్సన్గా చింతనిప్పుల చంద్రకళ బిక్షపతిని ఎన్నుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ చైర్పర్సన్ కావాలనే ఆశ ఉంటుందని, కానీ అవకాశం ఒక్కరికి మాత్రమే దక్కుతుందని స్పష్టం చేశారు. సీనియర్ నాయకుడిగా, ములుగు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందిస్తున్న బిక్షపతికి అనుభవం దృష్ట్యా ఈ అవకాశం కల్పించామని మంత్రి పేర్కొన్నారు. గతంలో ఎన్నో ఒత్తిడులు వచ్చినప్పటికీ పార్టీ మారకుండా నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మున్సిపాలిటీ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు బిక్షపతి అని అన్నారు. అవకాశం రానివారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో మంచి అవకాశాలు అందరికీ వస్తాయని మంత్రి భరోసా ఇచ్చారు. తనకు ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు—అందరూ సమానమని స్పష్టం చేశారు. ములుగు మున్సిపాలిటీలో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోవడానికి వెన్నుపోటు రాజకీయాలే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీలో ఉండి మోసం చేయడం క్షమించరాని నేరమని, అలాంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. ఎవరు వెన్నుపోటు రాజకీయాలు చేశారో తమకు తెలుసని, పద్ధతి మార్చుకోవాలని ఇది చివరి హెచ్చరిక అని అన్నారు. ములుగు జిల్లా మాజీ అధ్యక్షుడు నల్లెల కుమార్ను అన్నలాంటివారని పేర్కొంటూ, ఆయన కుమారుడు నల్లెల భరత్కు ఇంకా మంచి భవిష్యత్తు ఉందని, రాబోయే రోజుల్లో అవకాశాలు వస్తాయని తెలిపారు. తమను ఓడించేందుకు రియల్ ఎస్టేట్ వర్గాలు భారీగా డబ్బు ఖర్చు చేసినప్పటికీ ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారని మంత్రి సీతక్క అన్నారు. అన్ని ఎన్నికల్లో కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే విజయం ఖాయమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.


