దామోదర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తాం
జమ్మికుంట–వీణవంక రోడ్డుపై ప్రతిష్టాపనకు నిర్ణయం
హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి వొడితల ప్రణవ్
కాకతీయ, హుజురాబాద్ : జమ్మికుంట–వీణవంక రహదారిపై మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ ప్రకటించారు. దామోదర్ రెడ్డి సేవలను నిలబెట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరీంనగర్ పట్టణ పరిధిలోని సదాశివపల్లిలో గురువారం నిర్వహించిన దామోదర్ రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమంలో కాంస్య విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కార్యకర్తలకు అండగా నిలిచే నాయకుడిగా దామోదర్ రెడ్డి పేరు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. పనిపట్ల నిబద్ధత, నాయకత్వ లక్షణాలు ఆయన ప్రత్యేకతగా నిలిచాయని తెలిపారు.
అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది
విగ్రహం ఏర్పాటు ప్రకటనతో కమలాపూర్ నియోజకవర్గానికి చెందిన పాత నాయకులతో పాటు హుజూరాబాద్ ప్రాంత నేతలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా దామోదర్ రెడ్డిని అభిమానించే వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. గతం నుంచే విగ్రహం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ, 14 సంవత్సరాల తర్వాత తొలి అధికారిక ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విగ్రహంతో దామోదర్ రెడ్డి సేవలు, వ్యక్తిత్వం నేటి యువతకు తెలియజేసే అవకాశం ఉంటుందని వొడితల ప్రణవ్ పేర్కొన్నారు.


