బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
కాంగ్రెస్ హామీల అమలుపై చర్చకు సిద్ధం
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక వర్క్షాప్
పార్లమెంటరీ విధానాలపై నేతల మార్గనిర్దేశం
ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావిస్తాం
సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా వ్యూహం
మాజీ స్పీకర్, నిపుణుల సూచనలు తీసుకున్నాం
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాకతీయ,తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రజలకు చేసిన మోసాలు, నిరంతరం జరుగుతున్న అరాచకాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయడానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వర్క్షాప్ నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, సభా నియమ నిబంధనలు (రూల్ బుక్), రాజ్యాంగ సంబంధిత అంశాలపై కూడా అవగాహన కల్పించారు. శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తదితర సీనియర్ నేతలు వేర్వేరు సెషన్లలో మాట్లాడారు. వర్క్షాప్ ముగింపు సెషన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాబోయే బడ్జెట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంగళవారం ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. సభలో ఎలా మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలి, బడ్జెట్పై ఎలా స్పందించాలి అనే అంశాలపై సభ్యులకు పార్లమెంటరీ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలపై సభలో ఎలా చర్చించాలి అనే అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు చెప్పారు. బడ్జెట్లోని అంకెలను ఎలా విశ్లేషించాలి, ప్రభుత్వ ఖర్చులను ఎలా ప్రశ్నించాలి అనే విషయాలపై కూడా నేతలు ఎమ్మెల్యేలకు సూచనలు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. రాబోయే సమావేశాల్లో ప్రజల సమస్యలను బలంగా ప్రస్తావించాలనే దిశగా వ్యూహం సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
పార్లమెంటరీ విధానాలపై సూచనలు
ఈ సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ పార్లమెంటరీ విధానాలపై సభ్యులకు వివరించినట్లు కేటీఆర్ చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా, అనంతరం మండలి డిప్యూటీ చైర్మన్గా పనిచేసిన అనుభవాలను ఆయన సభ్యులతో పంచుకున్నారని తెలిపారు. మాజీ స్పీకర్, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి కూడా సభా వ్యవహారాలపై తన అనుభవాలను వివరించినట్లు చెప్పారు. గతంలో కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో శాసనసభలో ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించేవారో కూడా ఎమ్మెల్యేలకు వివరించారని పేర్కొన్నారు. మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితర నేతలు కూడా సమావేశంలో పాల్గొని సభ్యులకు మార్గనిర్దేశం చేసినట్లు తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, ప్రజా సమస్యలను ఎలా లేవనెత్తాలనే విషయాలపై సూచనలు ఇచ్చారని చెప్పారు. మాజీ శాసన మండలి సభ్యుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా సమావేశంలో పాల్గొని బడ్జెట్లోని ఆర్థిక అంశాలను ఎలా విశ్లేషించాలి అనే విషయాలను వివరించినట్లు తెలిపారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు లోపాలు, రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలను బలంగా ప్రస్తావించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే మరిన్ని సమావేశాలు నిర్వహించి సభ్యులను మరింత సిద్ధం చేస్తామని తెలిపారు.


