కరీంనగర్ను ఆదర్శంగా నిలుపుతాం..
మేయర్ కొలగాని శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి
కాకతీయ, కరీంనగర్ కార్పొరేషన్ : తెలంగాణలో కరీంనగర్ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే దిశగా నగర పాలకవర్గం కృషి చేస్తోందని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రెండో రోజు శనివారం నగరపాలక సంస్థ పరిధిలోని 3, 4, 5, 6, 7 డివిజన్లలో మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పర్యటించారు. 3వ డివిజన్ విద్యారణ్యపురిలో కార్పొరేటర్ సాదవేణి లావణ్యతో కలిసి పారిశుధ్య పనులు చేపట్టి రూ.5 లక్షలతో సీసీ డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశారు. 4వ డివిజన్ దుర్షేడ్లో కార్పొరేటర్ భూపతి రవీందర్తో కలిసి పారిశుధ్య పనులు చేపట్టి డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమిపూజ చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో వసతి సౌకర్యాల ఏర్పాటుకు రూ.10 లక్షలు కేటాయించారు. 5వ డివిజన్లో కార్పొరేటర్ గాదె రూపతో కలిసి అభివృద్ధి పనులకు భూమిపూజ చేయగా, 6వ డివిజన్ గుంటూరుపల్లిలో రూ.5 లక్షలతో డ్రైనేజీ పనులు ప్రారంభించారు. 7వ డివిజన్ సదాశివపల్లిలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్తో కలిసి రూ.9 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక ద్వారా 99 రోజుల్లో డివిజన్ల ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ దిలీప్ కుమార్, ఎస్ఈ రాజ్ కుమార్, పారిశుధ్య అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


