కాకతీయ, వరంగల్ : రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ తో ముందుకు సాగుతోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం మంత్రి సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఆరు దేవాలయాలకు రూ.4.35 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి శంకుస్థాపనలు చేశారు.
ఈ కార్యక్రమంలో సురేఖ మాట్లాడుతూ మట్టేవాడ భోగేశ్వర స్వామి దేవాలయం, దేశాయిపేట రంగనాయక స్వామి దేవాలయం, కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం, గోవిందరాజుల గుట్ట వద్ద ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం, కాశీ విశ్వేశ్వర రంగనాయక స్వామి దేవాలయం కాశిబుగ్గ, అబ్బని కుంటలోని మహేశ్వరి దేవాలయాల అభివృద్ధి నవీకరణ పనులకు నేడు శంకుస్థాపన చేశామని, నియోజకవర్గంలోని ప్రతీ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
భక్తులకు సౌకర్యార్థంగా ఉండేలా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. తూర్పు నియోజకవర్గానికి 18 దేవాలయాల అభివృద్ధి పనులకు మంజూరు చేశామని, అందులో భాగంగా నేడు ఆరు దేవాలయాల అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. మిగిలిన ఆలయాల అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. కాతీయుల కాలం నాటి చారిత్రాత్మక దేవాలయాలు వరంగల్ లో అధికంగా ఉన్నందున వాటిని పునరుద్ధరణ చేసి భవిష్యత్ తరాలకు అందించాలన్నారు.
పురావస్తు శాఖ అనుమతితో ఆయా దేవాలయాలు అభివృద్ధి చేస్తామని, దేవాదాయ శాఖకు సంబంధించిన అన్ని దేవాలయాలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్లు రామ తేజస్వి శిరీష్, కావేటి కవిత, చింతాకుల అనిల్ కుమార్, ఓని స్వర్ణలత భాస్కర్, సోమిశెట్టి ప్రవీణ్ కుమార్, ఎండోమెంట్ అధికారి సునీత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


