డ్రగ్స్ రహిత జిల్లా లక్ష్యంగా పనిచేయాలి
రైల్వే, బస్ స్టేషన్లలో నిఘా పెంచాలి
ప్రత్యేక తనిఖీలతో రవాణాను అరికట్టాలి
మాదకద్రవ్యాల నిరోధక పై విస్తృతంగా ప్రచారం కల్పించాలి
మహబూబాబాద్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
కాకతీయ, మహబూబాబాద్ : జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడంలో అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ తో కలిసి నేషనల్ నార్కోటిక్స్ కో-ఆర్డినేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైనా మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం చేస్తే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని కళాశాలల్లో పోలీసు శాఖ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మాదకద్రవ్యాల అలవాటుకు ఎవరూ బానిసలు కారాదని, ముఖ్యంగా యువత మేల్కొని డ్రగ్స్ను వదులుకోవాలని సూచించారు. వైద్య, ఆరోగ్యం, రెవెన్యూ, విద్య, అటవీ, డ్రగ్స్ తదితర శాఖల అధికారులు అందరూ పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలని తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ, మార్కెటింగ్, అటవీ, పోలీసు అన్ని చెక్పోస్టుల్లో పటిష్ట నిఘా పెట్టాలని చెప్పారు. డిగ్రీ, ఇంటర్మీడియట్ కాలేజీల ప్రిన్సిపాల్స్, ఎంఈవోలతో శిక్షణా అవగాహన కార్యక్రమాలు చేయాలని, అలాగే అందరూ వైద్యాధికారులు, ఏరియా హాస్పిటల్స్, సీహెచ్సీలలో ఎక్కడైనా మాదక ద్రవ్యాలు సేవించి ఎవరైనా వస్తే అలాంటి వారి వివరాలను పోలీసు శాఖకు అందజేయాలని సూచించారు. అలాగే వీఆర్ఏ, వీఆర్వోలకు గ్రామాల్లో డ్రగ్స్ సేవిస్తున్న వారి వివరాలను తెలియజేసేలా తగు ఆదేశాలు జారీ చేయాలని ఆర్డీవోలకు సూచించారు. జిల్లాలో విస్తృత ప్రత్యేక తనిఖీలు నిర్వహించి డ్రగ్స్ ల నాణ్యత ప్రమాణాలు, మందుల చిట్టి లేకుండా మందులు లేకుంటే ఎట్టి పరిస్థితిలో మందులు పంపిణీ చేయబడదని సంబంధిత మెడికల్ షాపుల యజమానులకు తెలిపాలని అన్నారు. సమావేశంలో డీఎస్పీ తిరుపతి రావు,ఎక్సైజ్ శాఖ అధికారి కిరణ్ కుమార్ , ట్రైబల్ వెల్ఫేర్ అధికారి దేశీ రామ్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, డ్రెస్ ఇన్స్పెక్టర్ ఉమారాణి, తదితరులు పాల్గొన్నారు.


