బంగ్లాదేశ్లో హింస
విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్యతో దేశమంతా అల్లర్లు
విద్యార్థి ఉద్యమ నేతను కాల్చిచంపిన దుండగులు
షేక్ హసీనా ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర
భారత్ వ్యతిరేక వ్యాఖ్యలతో వివాదాస్పదం
ఎన్నికల ప్రచారంలో ఉండగానే కాల్పులు
ఢాకా సహా దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు
కాకతీయ, నేషనల్ డెస్క్ : విద్యార్థి ఉద్యమ నేత షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్ మరోసారి అల్లకల్లోలంగా మారింది. గతంలో విద్యార్థుల తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన హాదీని దుండగులు కాల్చిచంపడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు చెలరేగాయి. నిరసనకారులు రోడ్డెక్కడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఝల్కాతీ జిల్లాలో 1994లో జన్మించిన ఉస్మాన్ హాదీ చిన్ననాటి నుంచే ఉద్యమ భావజాలంతో ఎదిగాడు. విద్యార్థి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అతడు గత ఏడాది జూలైలో అవామీలీగ్, అప్పటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల తిరుగుబాటులో కీలక పాత్ర పోషించాడు. ఆ ఉద్యమం నుంచే పుట్టుకొచ్చిన ‘ఇన్కిలాబ్ మంచ్’ సంస్థకు కన్వీనర్గా వ్యవహరించాడు. హాదీ పలుమార్లు భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్లో భాగంగా చూపించిన మ్యాప్ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అతడిపై దేశీయంగా, అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి.
విద్యార్థుల తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించినప్పటికీ, యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇన్కిలాబ్ మంచ్ను రాజకీయ పార్టీగా గుర్తించలేదు. వచ్చే జాతీయ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో హాదీ స్వతంత్ర అభ్యర్థిగా ఢాకా-8 నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాడు. డిసెంబరు 12న ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆటోలో ప్రయాణిస్తున్న హాదీపై గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వచ్చి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని తొలుత ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం సింగపూర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం అతడు మృతి చెందాడు. తూటా గాయంతో మెదడుకు తీవ్ర నష్టం వాటిల్లిందని వైద్యులు తెలిపారు.
హాదీ మృతివార్తతో ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు, ఇన్కిలాబ్ మంచ్ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. భారత్, అవామీలీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మీడియా కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు హాదీ మృతికి సంతాపంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒకరోజు జాతీయ సంతాపదినాన్ని ప్రకటించింది.


