కేయూలో ‘వీర్ బాల్ దివస్’
పోస్టర్ను ఆవిష్కరించిన వీసీ అధికారులు
జనవరి 3న సెనేట్ హాల్లో కార్యక్రమం
వ్యాస, వక్తృత్వ పోటీల నిర్వహణ
విద్యార్థుల్లో ధైర్యం, త్యాగం పెంపు లక్ష్యం
కేయూ రిజిస్ట్రార్ ప్రో. వి. రామచంద్రం
కాకతీయ, హనుమకొండ : కాకతీయ యూనివర్సిటీ డీన్ స్టూడెంట్ అఫైర్స్, సోషాలజీ, సోషల్ వర్క్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 3, 2026న నిర్వహించనున్న “వీర్ బాల్ దివస్” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కేయూ రిజిస్ట్రార్ ప్రో. వి. రామచంద్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రో. మామిడాల ఇస్తారి, కేయూ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రో. తాళ్ళపల్లి మనోహర్, సోషాలజీ & సోషల్ వర్క్ విభాగాధిపతి డా. ఎం. స్వర్ణలత, అధ్యాపకులు డా. కే. సుభాష్, డా. కే. ప్రసన్న, డా. ఎస్. సాహితీ, ఎం. జాస్మిన్, బి. రజిత, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రో. ఈసం నారాయణ పాల్గొన్నారు.
త్యాగ స్ఫూర్తికి నివాళి
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రో. వి. రామచంద్రం మాట్లాడుతూ, భారత ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దేశం, ధర్మం కోసం కేవలం ఏడేళ్ల వయసులో ప్రాణాలు త్యాగం చేసిన జోరావర్ సింగ్, ఫతే సింగ్ల స్మారకార్థంగా జనవరి 3న ‘వీర్ బాల్ దివస్’ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం కేయూ సెనేట్ హాల్లో జరుగుతుందని చెప్పారు. డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రో. మామిడాల ఇస్తారి, డా. స్వర్ణలత మాట్లాడుతూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు “వీర్ బాల్ దివస్ – జాతి నిర్మాణానికి స్ఫూర్తి” అనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేయూ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
జనవరి 2, 2026 వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం ఉందని, యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం కేయూ గోల్డెన్ జూబిలీ వేడుకల్లో భాగంగా విద్యార్థుల్లో ధైర్యం, త్యాగం, జాతీయతా భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.


