వాలమ్తారి భూములను
విద్యాసంస్థలకు కేటాయించండి
ముఖ్యమంత్రికి జీవన్ రెడ్డి వినతి
కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామంలోని వాలమ్తారి వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రంలో యువ భారత సమగ్ర నివాస పాఠశాల, కేంద్రీయ విద్యాలయం, క్రీడా మైదానం ఏర్పాటుకు భూమి కేటాయించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శనివారం సీఎంకు లేఖ రాశారు. జగిత్యాల ప్రాంత రైతులు వరి సాగుతోపాటు పలు పంటలు, పండ్ల తోటలు సాగు చేస్తున్న నేపథ్యంలో సాగునీటి వినియోగం, నీటి నిర్వహణ విధానాలపై పరిశోధనలు నిర్వహించడం, రైతులకు శిక్షణ అందించడం వంటి లక్ష్యాలతో జగిత్యాల గ్రామీణ మండలం చల్గల్ గ్రామంలో సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో వాలమ్తారి వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే అని లేఖలో పేర్కొన్నారు. గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో యువ భారత సమగ్ర నివాస పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో చల్గల్ వాలమ్తారి ప్రదర్శనా క్షేత్రంలో సుమారు 25 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చొరవతో కేంద్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లాకు మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయం స్థాపనకు అవసరమైన 5 ఎకరాల భూమిని కూడా ఇదే ప్రదేశంలో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం 25 ఎకరాలు, కేంద్రీయ విద్యాలయం కోసం 5 ఎకరాలు, క్రీడా మైదానం కోసం 10 ఎకరాలు కలిపి మొత్తం 40 ఎకరాల భూమి కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.


