కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఫీజు రీయంబర్స్ మెంట్ బ్రాండ్ అంబాసిడర్లం తామేనని సంకలు గుద్దుకున్న కాంగ్రెస్ నేతల నిర్వాకంవల్లే కాలేజీలు మూతపడి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మూసీ సుందరీకరణ, ఫోర్త్ సిటీ, మిస్ వరల్డ్ పోటీల పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 15 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు కనబడటం లేదా? రాష్ట్ర బడ్జెట్ లో నుండి రూ.8 వేల కోట్ల రూపాయలు చెల్లించలేరా? అంటూ ప్రశ్నించారు.
నక్సలైట్లను ఎన్ కౌంటర్ చేయడంపైనా కేంద్ర మంత్రి తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘దేశాన్ని రక్షించే ఆర్మీ, చట్టాన్ని కాపాడే పోలీసుల చేతుల్లోనే తుపాకీ ఉండాలి. అట్లా కాకుండా పర్మిషన్ లేకుండా ఎవరి చేతిలో తుపాకీ ఉన్నా సంఘ విద్రోహ శక్తిగానే భావిస్తాం. అందుకే తుపాకీ విడిచి లొంగిపోవాలని కోరుతున్నాం. అట్లా కాకుండా తుపాకులతో మేం కాలుస్తూనే ఉంటాం… మీరు మాత్రం చర్చలకు పిలవాల్సిందేనంటే వినే పిరికిపంద ప్రభుత్వం మాది కాదు. నరేంద్రమోదీ ఆధ్వర్యంలో అమిత్ షా నాయకత్వంలో 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించి తీరుతాం’’అని స్పష్టం చేశారు. జాతీయ జెండా ఎగరనీయబోమని, ఎన్నికలే జరపనీయబోమని ఏ దేశపోళ్లు అనాలే… మీరే చెప్పాలంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో యూరియా కొరతకు ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. సరైన ప్రణాళిక లేకపోవడం, యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నా చర్యల్లేకపోవడంవల్లే ఈ దుస్థితి తలెత్తిందని చెప్పారు. మంచిర్యాల రైల్వే స్టేషన్ వద్ద ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏమన్నారంటే…
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంవల్ల రాష్ట్రంలోని 15 నుండి 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. గత పదేళ్లపాటు కేసీఆర్ ఫీజు రీయంబర్స్ మెంట్ ఇయ్యక తిప్పలు పెట్టారు. ఫీజు రీయంబర్స్ మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ మేమేనని ఇన్నాళ్లు సంకలు గుద్దుకున్న కాంగ్రెసోళ్లు 20 నెలలుగా ఆ బకాయిలియ్యకుండా మోసం చేస్తున్నరు. ? కేసీఆర్ కు, మీకు తేడా ఏముంది? పంజాబ్ పోయి చెక్కులిచ్చి బౌన్స్ చేసి తెలంగాణ పరువును బజారున పడేస్తే…. ఈ కాంగ్రెసోళ్లు టోకెన్ల మీద టోకెన్లు ఇస్తూ మోసం చేస్తున్నరే తప్ప పైసా ఇయ్యడం లేదు. కాంగ్రెస్ నమ్మిన పాపానికి పెనం మీద నుండి పొయ్యలో పడ్డట్లయింది.
ఫీజు రీయంబర్స్ మెంట్ పై ఆధారపడి ఈ రాష్ట్రంలో ఏటా 15 లక్షల మందికిపైగా పేద విద్యార్థులు డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడికల్, ఎంబీఏ, ఎంసీఏ వంటి ఉన్నత కోర్సులను చదువుకుంటున్నరు. నాలుగైదు ఏళ్లుగా ఫీజు రీయంబర్స్ మెంట్ పైసలు చెల్లించకపోతే వాళ్ల పరిస్థితి ఏంది? ఫీజు రీయంబర్స్ మెంట్ ఉందనే ఉద్దేశంతోనే ఉన్నత విద్యా కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఇయాళ నడిరోడ్డున పడ్డరు. ఫీజుల కట్టకపోవడంవల్ల కాలేజీలు మెడపట్టి బయటకు నెట్టేస్తున్నయి.
ఫోర్త్ సిటీ, మూసీ సుందరీకరణ, మిస్ వరల్డ్ పోటీల పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నరు కదా?… పేద విద్యార్థుల కోసం రూ.8 వేల కట్టలేరా? కాలేజీలు బంద్ అయితే విద్యార్థులు ఎటు పోవాలి? ఏం చదువుకోవాలి? వాళ్ల భవిష్యత్తును రోడ్డున పడేస్తారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే? కాలేజీ యాజమాన్యాలకు ఆనాడే చెప్పిన. కాంగ్రెస్ టోకెన్ల పేరుతో మోసం చేస్తదే తప్ప మీ గోడు పట్టించుకోదని. ఆనాడు చర్చలకు వెళ్లి వాళ్ల మాటలు నమ్మి కాలేజీ యాజమాన్యాలు మోసపోయాయి. కాలేజీ యాజమన్యాల్లో కొందరు కాంగ్రెస్ తొత్తులు ఉన్నందునే వాళ్లకు ఈ దుస్థితి ఏర్పడింది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. తక్షణమే ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా.
పేదోడు తెలంగాణలో బతకాలంటే భయమైతుంది. రోగమొస్తే కూడా పట్టించుకునే నాథుడే లేకపాయే… ఆరోగ్యశ్రీ పథకం కూడా మాదేనని జబ్బలు చర్సుకున్న కాంగ్రెసోళ్లు ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వకపోవడంతో రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు రానీయ్యడం లేదు. ఆరోగ్యశ్రీ పైసలియ్యనిదే ఆసుపత్రుల్లోకి అడుగు పెట్టనిచ్చేదే లేదని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులోళ్లు తెగేసి చెబుతున్నరు. పోనీ సర్కారు దవాఖానాకైనా పోదామంటే సూది లేకపాయే, మందు బిళ్లలు కూడా లేకపాయే. మరి ఏం చేయాలే…. పేదోడికి రోగమొస్తే చావాల్సిందేనా? ఇందుకోసమేనా? కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించింది? ప్రజా సమస్యలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ స్పందించవు. ఏమైనా అంటే కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కాం అంటూ రచ్చ చేస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నయ్.
రైల్వే స్టేషన్ల అభివ్రుద్ధి పేరుతో అదానీ, అంబానీలకు కట్టబెట్టాలని చూస్తున్నారంటూ కమ్యూనిస్టులు చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా….
అభివ్రుద్ధిపై కాకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు కాబట్టే కమ్యూనిస్టులు కాలగర్భంలో కలిసిపోయారు. అభివ్రుధ్ది కోసం పనిచేస్తున్నాం కాబట్టే 2 సీట్ల నుండి కేంద్రంలో వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చినం.
నక్సల్స్ ఎన్ కౌంటర్ పై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ…
నక్సల్స్ చంపింది ఎవరిని? పేదలు, ఆదివాసీ బిడ్డలనే కదా? మావోయిస్టులను సమర్ధించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిట్టెం నర్సిరెడ్డి, శ్రీపాదరావు, రాగ్యానాయక్ సహా ఎంతో మందిని నక్సల్స్ చంపారు. డ్యూటీ చేస్తున్న పోలీసులను కూడా నక్సల్స్ పొట్టనపెట్టుకుంటున్నారు కదా? పొట్ట కూటి కోసం డ్యూటీ చేస్తున్న వాళ్లను చంపితే మాట్లాడరా? చనిపోయినోళ్లంతా ప్రజలే కదా? తెలుగు వాళ్లే కదా?
దేశాన్ని రక్షించే ఆర్మీ, చట్టాన్ని కాపాడే పోలీసుల చేతుల్లోనే తుపాకీ ఉండాలి. అట్లా కాకుండా పర్మిషన్ లేకుండా ఎవరి చేతిలో తుపాకీ ఉన్నా సంఘ విద్రోహ శక్తిగానే భావిస్తాం. అందుకే తుపాకీ విడిచి లొంగిపోవాలని కోరుతున్నాం. అట్లా కాకుండా తుపాకులతో మేం కాలుస్తూనే ఉంటాం… మీరు మాత్రం చర్చలకు పిలవాల్సిందేనంటే వినే పిరికిపంద ప్రభుత్వం మాది కాదు. నరేంద్రమోదీ ఆధ్వర్యంలో అమిత్ షా నాయకత్వంలో 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించి తీరుతాం. జాతీయ జెండా ఎగరనీయని, ఎన్నికలే జరపనీయని, ఆదివాసీ అమాయకబిడ్డలను చంపేటోళ్లను ఏమనాలి? ఏ దేశపోళ్లు అనాలే… మీరే చెప్పండి.
పంచాయతీ ఎన్నికల జాప్యంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ…
గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే దమ్ములేక రకరకాల సాకులు చెబుతోంది. గ్రామ పంచాయతీల అభివ్రుద్ధికి నిధులిస్తోంది కేంద్రమే. అయినా కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని తిట్టడం సిగ్గు చేటు.
రాష్ట్రంలో యూరియా కొరత, రైతుల కష్టాలపై స్పందిస్తూ…
రబీ సీజన్ లో 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంపితే… 2.05 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మిగిలింది. ఆ యూరియాను ఏం చేశారో చెప్పడం లేదు. పంపిణీ చేసిన యూరియాను ప్లాన్ ప్రకారం సరఫరా చేయడం లేదు. పైగా యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నా పట్టించుకోరు. నిన్ననే మిర్యాలగూడలో ఎమ్మెల్యే గన్ మెన్ లారీ యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలించబోవడమే ఇందుకు నిదర్శనం. అసలు కాంగ్రెస్ కు ప్లానే లేదు. రబీ యూరియా వినియోగంపై లెక్కా పత్రం లేదు. ఇదేమని అడిగితే… కేంద్రాన్ని బదనాం చేయడమే పెట్టుకున్నరు. ఇకనైనా కేంద్రాన్ని బదనాం చేయడం పక్కనపెట్టి యూరియా విషయంలో రైతులు పడుతున్న బాధను అర్ధం చేసుకుని ప్రణాళిక ప్రకారం పంపిణీ చేయాలని కోరుతున్నా.


