ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన
కాకతీయ, నెల్లికుదురు: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక తొంభై తొమ్మిది రోజుల కార్యాచరణలో భాగంగా బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి శరత్, స్వచ్ఛ భారత్ సమన్వయకర్త రవి కుమార్ గ్రామ ప్రజలకు చెత్త నిర్వహణపై వివరించారు. తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్తను వేర్వేరుగా నిర్వహించాలని సూచించారు. ఒక్కసారి వాడే ప్లాస్టిక్ను పూర్తిగా నివారించాలని, ప్రతి ఇంటి వద్ద చెత్తను వేరు చేసి పంచాయతీ వాహనంలో వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్టల ఉప్పలయ్య, వార్డు సభ్యులు సరిత, మహేశ్వరి, అంగన్వాడి సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.


