ఉగాది ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి
సామాజిక మార్పునకు నాంది కావాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
కాకతీయ, కొత్తగూడెం: వచ్చే నూతన వసంతం సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా ఆకాంక్షించారు. ప్రకృతిలో వచ్చే మార్పుల వలె సమాజంలో కూడా సానుకూల మార్పులు రావాలని తెలిపారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మాట్లాడుతూ ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని నేర్పుతాయని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, పండుగలు సోదరభావాన్ని పెంపొందించేవిగా ఉండాలని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.


