కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
కాకతీయ, స్టేషన్ ఘనపూర్ : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లింగాల ఘనపూర్ మండలం నెల్లూట్లలోని కెబిఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 67 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.67,07,774 విలువైన చెక్కులు, 32 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు రూ.11,01,000 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. గడిచిన 15 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధి గాలికి వదిలేసి, చిల్లర పనులు, అవినీతి, అక్రమాలతో ఘనపూర్కు చెడ్డపేరు తెచ్చారని ఆయన ఆరోపించారు. పదవులు, పథకాలు అమ్ముకున్నవారు ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అని విమర్శించారు.
21 నెలలలోనే రూ.1026 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చానని, రాబోయే మూడు సంవత్సరాల్లో మరో రూ.2000 కోట్ల నిధులు తెస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ముందుంచిన అభివృద్ధి పనుల వివరాల్లో ఏది తప్పని నిరూపించినా దానికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని సవాల్ విసిరారు.


