ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్ఐలు
ఏసీబీ వలలో ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీసులు
నోటీసుల కోసం లక్ష రూపాయలు డిమాండ్
ఫిర్యాదుదారుడిని బెదిరించి డబ్బు వసూలుకు ప్రయత్నం
ఎల్బీనగర్ చౌరస్తాలో ఏసీబీ ఉచ్చు.. నగదు స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
కాకతీయ, హైదరాబాద్ : లంచం తీసుకుంటూ ఇద్దరు ఎస్ఐలు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఆర్ఎస్సైలు ప్రమోద్ గౌడ్, జటావత్ బాబు నాయక్ ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం రామంతాపూర్కు చెందిన ఒక వ్యాపారవేత్త సైబర్ మోసానికి గురై 2 లక్షల రూపాయలు కోల్పోయాడు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లగా అతనినే నిందితుడిగా చూపిస్తూ అరెస్ట్ చేస్తామని అధికారులు బెదిరించినట్లు సమాచారం. అరెస్ట్ చేయకుండా కేవలం నోటీసు ఇచ్చి పంపేందుకు లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని ఇద్దరు ఎస్ఐలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఉచ్చు వేసి ఎల్బీనగర్ చౌరస్తా వద్ద బాబు నాయక్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్ట్ చేశారు. నిందితులను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు.


