కాకతీయ, తెలంగాణ బ్యూరో : మందమర్రి పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్లైన ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో షేర్ చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ సంస్థ ఎన్ సి ఎమ్ ఈ సి ( నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ & ఎక్స్ ప్లైటెడ్ చిల్డ్రన్ ) అందించిన సమాచారం ఆధారంగా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఈ కేసును మందమర్రి పోలీసులకు అప్పగించింది. వెంటనే స్పందించిన ఎస్సై రాజశేఖర్ సైబర్ చట్టం కింద రెండు కేసులు నమోదు చేశారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. శశిధర్ రెడ్డి దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నారుల అశ్లీల వీడియోలు లేదా ఫోటోలు చూడడం, షేర్ చేయడం, ఫార్వర్డ్ చేయడం, ప్రచారం చేయడం తీవ్రమైన నేరం. నలుగురు చూడరని భావించి ఇటువంటి చర్యలకు పాల్పడితే, తెలియక చేసినా చట్టం దృష్టిలో అది నేరమే అని హెచ్చరించారు. చిన్నారుల రక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని, సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అశ్లీల విషయాలకు దూరంగా ఉండాలని సూచించారు.


