సదర్ల భీమన్న వద్ద ఆదివాసీల పూజలు
నదీజలాలతో గజాల శుద్ధి
అర్ధరాత్రి మైసమ్మ తల్లికి విశేష పూజలు
కాకతీయ, రామకృష్ణాపూర్ : స్థానిక బొక్కల గుట్ట – గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లి జాతర ఆదివాసీ, నాయక్ పోడ్ సమాజం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కొనసాగుతోంది. మూడు రోజుల పాటు సాగే ఈ జాతరలో తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలకు ప్రతీకగా ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. జాతర తొలి రోజు సదర్ల భీమన్న వద్ద ఉన్న గజాలను కాలినడకన నది వద్దకు తీసుకెళ్లి నదీజలాలతో శుద్ధి చేశారు. అనంతరం ఆడపడుచులు 101 కుండల్లో తెచ్చిన పవిత్ర నది జలాలతో సాయంత్రం మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున విశేష పూజలు, సాయంత్రం పెద్ద పట్నం, అర్ధరాత్రి మైసమ్మ తల్లికి సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆదివారం గుట్ట కింద దర్బార్తో మూడు రోజుల జాతర ఘనంగా ముగియనుంది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ జాతరను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనంతో పుణ్యఫలం పొందుతున్నారు.


