రేపు సీతారాముల కల్యాణం
భద్రాద్రి ఆలయంలో సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం
28 పట్టువస్త్రాలతో ఆలయానికి రానున్న ముఖ్యమంత్రి
ఆలయ మాస్టర్ ప్లాన్ పనులను ప్రారంభించనున్న సీఎం రేవంత్
మూడు విడతల్లో రూ.586 కోట్ల పనులకు శంకుస్థాపన
మొదటి విడత పనులకు ఇప్పటికే రూ.351 కోట్లు విడుదల
శ్రీరామ నవమి ఉత్సవాలకు సకల ఏర్పాటు చేశాం : జిల్లా కలెక్టర్ అంకిత్
భక్తులకు భద్రత వలయం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ఏర్పాట్లు పూర్తి
: దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్
కాకతీయ, కొత్తగూడెం : దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రాములవారి కల్యాణానికి సర్వం సిద్ధమైంది. భద్రగిరి కొండపై వెలసిన శ్రీ సీతారాముల కల్యాణాన్ని శుభకర మంగళ వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలతో సీతమ్మతో శ్రీరాముడికి కల్యాణం జరిపించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 27న శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి.. 28వ తేదీన రాములోరి పట్టాభిషేకానికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. శుభసిల్లిన వేదమంత్రాల సాక్షిగా ఆ దేవతమూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో జరిగే సీతారామచంద్రస్వామి కళ్యాణ విశిష్టతను.. రెండు రోజులు జరిగే కార్యక్రమాలను ఒకేరోజు జరపటం విశిష్టమైన రోజు అని పురోహితులు చెప్పుకొస్తున్నారు.

మాస్టర్ ప్లాన్ పనులకు 28 న శంకుస్థాపన
దక్షిణ యోజన బాసిల్లుతున్న భద్రాద్రి రాముడు ఆలయానికి పునరుద్ధరణ పనులు చేపట్టడానికి దేవాలయం అభివృద్ధితో పాటు భద్రాచల పట్టణ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకే తలమానికంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది. చేపట్టే అభివృద్ధి పనులకు గాను మూడు విడతలుగా మంజూరయ్యే నిధులు మొత్తంరూ. 586 కోట్లు ప్రభుత్వ అంచనా వేసింది. కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేకం అమూల్యమైన ఘట్టాలను దృష్టిలో ఉంచుకొని మొదటి విడతగా రూ.380 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. 2024 సంవత్సరం మే 11వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలాన్ని పర్యటించిన సందర్భంగా రామాలయ అభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. పరిపాలన ఉత్తర్వుల మేరకు విడుదలైన రూ.380 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి, పట్టణాల అభివృద్ధికి అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. కళ్యాణానికి హాజరవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ చేసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రజల అదృష్టం మేరకే తెలిపిన వెంటనే రూ.586 కోట్ల రూపాయలను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రత్యేక ఉత్తర్వులు జారీ : దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్
భద్రాచలం దేవస్థానము, పట్టణ అభివృద్ధి కోసం జీవో నెంబర్ ఆర్టీ 167 ద్వారా ఉత్తర్వులు జారీ చేస్తూ మొదటి విడతగా రూ.381 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తెలిపారు. కళ్యాణ మహోత్సవానికి హాజరవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని, కళ్యాణానికి హాజరయ్యే కోట్లాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకల సౌకర్యాలు కల్పించేందుకు అత్యవసరంగా ఈ నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

అన్ని శాఖల సమన్వయం నియంత్రణ పరిపాలన : జిల్లా కలెక్టర్ అంకిత్
దక్షిణ భారతదేశంలో ఎంతో పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం తదుపరి జరిగే పట్టాభిషేకానికి హాజరయ్యే వేలాది మంది భక్త జనసందోహానికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో విధులు నిర్వహించేందుకు ఇప్పటికే సమీక్ష నిర్వహించామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లను మిథున స్టేడియంలో ప్రత్యేక గ్యాలరీలు, వేదికలు, భక్తులు కూర్చునేందుకు సకల సదుపాయాలు, ప్రవేశ-నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్, వైద్య సదుపాయాలు, క్యూలైన్ పద్ధతి తదితర వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు అదనపు కలెక్టర్ సౌరబ్ శర్మ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టామని తెలిపారు. ఈ వేడుకల్లో దేవస్థానం ఈవో దామోదర్ రావు, తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు పూర్తిస్థాయిలో సహకరించారని తెలిపారు.

భక్తులకు అడుగడుగున రక్షణ కవచం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఈ నెల 27, 28 తేదీలలో జరిగే శ్రీరామనవమి పట్టాభిషేక మహోత్సవానికి హాజరయ్యే వేలాది మంది భక్తుల కోసం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడుగడుగున రక్షణ కవచంగా పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. అందుకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 2000 మంది పోలీసు బలగాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విధివిధానాలను క్షుణ్ణంగా తెలియజేసి సెక్టార్ల వారీగా ఇన్చార్జీలను నియమించి ట్రాఫిక్ నియంత్రణ, ప్రతిష్టాత్మక బందోబస్తు ప్రణాళికలతో ముందుకెళ్లామని, ఇందుకోసం పార్కింగ్ స్థలాలు, భారీ కేడ్లు, ప్రసాద కౌంటర్లు, సంబంధిత ప్రాంతాల్లో ప్రత్యేక క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.



