కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ సంపూర్ణ మద్దతు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలి
టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్
కాకతీయ, నర్సంపేట టౌన్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తెలంగాణ జన సమితి (టీజేఎస్) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాసులు తెలిపారు. వరంగల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి టీజేఎస్ శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నర్సంపేటలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్ అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ జన సమితి వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశంలో అంబటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, ఉద్యమకారులను పట్టించుకోకుండా అప్పటి పాలకులు కుటుంబ పాలనతో లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతోనే గత ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని గుర్తుచేశారు.
హామీలు అమలు చేయాలని విజ్ఞప్తి
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చాలని అంబటి శ్రీనివాస్ కోరారు. స్థానిక సంస్థలు ముఖ్యంగా మున్సిపాలిటీల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి, ఖచ్చితమైన ప్రణాళికలతో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. టీజేఎస్ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు వరంగల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో తమ పార్టీ కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో అన్యాయానికి గురైన తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీజేఎస్ రాష్ట్ర నాయకులు గుంటి రామచందర్, బోనగాని రవీందర్, సాయికుమార్, మహబూబ్ అలీ, సందాని, గుర్తి సంజీవ, గిరిజాల రాజేష్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


