ఇంటర్ పరీక్షలపై కట్టుదిట్టమైన నిఘా
జిల్లా యంత్రాంగం అలర్ట్
విద్యార్థులకు పూర్తి సౌకర్యాలు, కఠిన పర్యవేక్షణ
ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం
36,426 మంది విద్యార్థులకు పరీక్షలు
57 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ
కాపీయింగ్పై ప్రత్యేక నిఘా బృందాలు
హాల్ టికెట్పై క్యూ ఆర్ కోడ్, ఆలస్యానికి సడలింపు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను సాఫీగా కొనసాగించేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం స్పష్టమైన సూచనలు జారీ చేసింది. ప్రాక్టికల్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో థియరీ పరీక్షల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
విద్యార్థులకు సౌలభ్యం కల్పించే చర్యల్లో భాగంగా సాంకేతిక సదుపాయాలను కూడా అమలు చేశారు. పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించే విధంగా హాల్ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచి వాటిపై క్యూ ఆర్ కోడ్ను ఏర్పాటు చేశారు. ఈ కోడ్ను మొబైల్ ద్వారా స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రం వివరాలు, స్థాన సమాచారం వెంటనే తెలుసుకునే వీలుంది. హాల్ టికెట్లలో ఏవైనా పొరపాట్లు ఉన్నా వెంటనే సవరించే ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లాలో భారీ ఏర్పాట్లు, కాపీయింగ్పై కఠిన నిఘా
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు చెందిన మొత్తం 36,426 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 18,175 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 18,251 మంది ఉన్నారు. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా 57 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక సదుపాయాలతో కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు అవకాశం లేకుండా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తున్నారు. పర్యవేక్షణ కోసం హైపవర్ కమిటీతో పాటు జిల్లా స్థాయి పరీక్షల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేశారు. కాపీయింగ్ నివారణకు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నాయి. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంచి మాల్ ప్రాక్టీస్కు అడ్డుకట్ట వేయనున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు కూడా పర్యవేక్షణలో భాగస్వామ్యం కానున్నారు.
విద్యార్థులకు పూర్తి సౌకర్యాలు, హాల్ టికెట్ నిబంధనల్లో సడలింపు
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల్లో సమగ్ర ఏర్పాట్లు చేశారు. ప్రతి కేంద్రంలో తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, తగిన గాలి–వెలుతురు, అనువైన ఫర్నీచర్, ఆరోగ్య శిబిరాలు, ప్రథమ చికిత్స సదుపాయాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల రాకపోకలను సులభతరం చేసేందుకు ప్రత్యేక బస్సులు నడపాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన ప్రశ్నపత్రాలు, సమాధానపత్రాలు మరియు ఇతర సామగ్రి ఇప్పటికే జిల్లాకు చేరినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో విద్యార్థులకు సౌలభ్యం కల్పించే దిశగా హాల్ టికెట్ జారీ విధానంలో సడలింపులు అమలు చేశారు. ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్తో పరీక్షలకు హాజరుకావచ్చని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. గతంలో అమలులో ఉన్న కఠిన సమయ నిబంధనలను సడలిస్తూ ఈసారి పరీక్షలకు ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు కూడా అనుమతి ఇవ్వనున్నారు. పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాల ముందే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
వి. గంగాధర్, కరీంనగర్ డీఐఈవో,
డీఐఈవో వివరణ(డిస్ట్రీక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్)
ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈవో) వి. గంగాధర్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. హాల్ టికెట్ల విషయంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా జరిగేలా చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.


