సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
కోటంచ ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్ రాహుల్ శర్మ
భద్రత, ట్రాఫిక్, సదుపాయాలపై అధికారులకు కీలక ఆదేశాలు
కాకతీయ, భూపాలపల్లి : ఈ నెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కోటంచలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సంకీర్త్ బుధవారం క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా కలెక్టర్, ఎస్పీ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా వడివట్టం కట్టి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పరిసరాల్లో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, త్రాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి సెక్టార్కు ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఆలయాన్ని సుందరంగా అలంకరించాలని, భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
నిరంతర విద్యుత్ – మెరుగైన పారిశుద్ధ్యం
పారిశుద్ధ్య నిర్వహణకు అదనపు సిబ్బందిని నియమించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, సీఎం పర్యటన సమయంలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ సీఎం పర్యటన దృష్ట్యా నాలుగు పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సౌకర్యంగా దారి సూచించే సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా సీఎం రాకపోకల కోసం ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్ స్థలాన్ని కలెక్టర్, ఎస్పీ ముందుగా పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్ నాయక్, ఆర్ అండ్ బీ ఈఈ రమేష్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్వేత, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ మహేష్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


